గోదావరి-కావేరి అనుసంధానం.. రాష్ట్రం మీదుగానే?
ABN , First Publish Date - 2021-03-03T09:27:13+05:30 IST
కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై రాష్ట్రప్రభుత్వం తన ప్రతిపాదనలు పంపింది. పోలవరం-వైకుంఠపురం-బానకచర్ల
తెరపైకి వైకుంఠపురం-బానకచర్ల
కేంద్రానికి జలవనరుల శాఖ ప్రతిపాదనలు
అమరావతి, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై రాష్ట్రప్రభుత్వం తన ప్రతిపాదనలు పంపింది. పోలవరం-వైకుంఠపురం-బానకచర్ల పథకాన్ని తెరపైకి తెచ్చింది. వాస్తవానికి గోదావరి-కావేరి అనుసంధాన పథకాన్ని తెలంగాణ భూభాగం మీదుగా అమలు చేయాలని జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) ప్రతిపాదించింది. తెలంగాణలోని జానంపేట నుంచి గోదావరి జలాలను నాగార్జునసాగర్లోకి ఎత్తిపోయాలని సూచించింది. ఇది కాకుం డా.. తెలంగాణలోని ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ దాకా జలాలను తరలించాలని.. సాగర్ నుంచి పెన్నా మీదుగా కావేరి నదికి మళ్లించే ప్రణాళికనూ సిద్ధం చేసింది. దీనిని అమలు చేస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు కలిపి 247 టీఎంసీలిస్తామని ఎన్డబ్ల్యూడీఏ చెబుతోంది. అయితే దీన్ని ఏపీ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో గతంలోనే సిద్ధం చేసిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది. ఈ ప్రతిపాదనల ప్రకారం..పోలవరం కుడి కాలువ నుంచి వైకుంఠపురం.. అక్కడి నుంచి బానకచర్ల మీదుగా పెన్నాకు.. అక్కడి నుంచి కావేరికి గోదావరి జలాలను తరలించాల్సి ఉంటుంది. దీనిపై దృష్టి సారించాలని రాష్ట్రప్రభుత్వం సూచించింది. ఈ విషయాన్ని సోమవారం నాటి సమీక్షలో అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రం మీదుగా ఈ పథకం అమలు జరిగేలా చూడాలని ఆదేశించారు. నిజానికి పథకానికి తెలంగాణ, ఒడిశా వ్యతిరేకం కాబట్టి ఏపీ ప్రతిపాదనలకు కేంద్రం మొగ్గు చూపవచ్చని జల వనరుల శాఖ భావిస్తోంది.