పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంపుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం
ABN , First Publish Date - 2020-07-11T08:39:31+05:30 IST
పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంపు ప్రతిపాదనను అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం గోదావరి బోర్డును కోరింది.
మిగులు జలాల పంపిణీ తేలే వరకు వద్దు
గోదావరి బోర్డుకు టీఎస్ సర్కారు లేఖ
హైదరాబాద్, జులై 10 (ఆంధ్రజ్యోతి): పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంపు ప్రతిపాదనను అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం గోదావరి బోర్డును కోరింది. ఈ మేరకు బోర్డుకు ఇరిగేషన్ శాఖ ఈఎన్ సీ మురళీధర్రావు లేఖ రాశారు. పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 17,633 క్యూసెక్కుల నుంచి 50 వేల క్యూసెక్కులకు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని తన లేఖలో ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా ఏడాదికి సుమారు 300 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు తరలించడానికి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసిందని, ఈ నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించే అవకాశం ఉందని చెప్పారు.
గోదావరి బేసిన్లోని మిగులు జలాల పంపిణీపై తుది నిర్ణయం తీసుకోకుండా ఏపీ ప్రభుత్వం ఇలా నీటిని మళ్లించడం ద్వారా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని అన్నారు. మిగులు జాలాల పంపిణీ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే ఇలాంటి ప్రాజెక్టును చేపట్టాలని కోరారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రతిపాదించిన పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంపును అడ్డుకోవాలని బోర్డుకు ఆయన విజ్ఞప్తి చేశారు.