రేషన్, మెడిసిన్స్ సిద్ధం చేయండి: పోలవరం MLA
ABN , First Publish Date - 2022-07-11T15:15:58+05:30 IST
ఎడతెరిపి లేని భారీ వర్షాలు, గోదావరికి వరద ప్రవాహం ఉధృతమవుతున్న నేపథ్యంలో పోలవరం ఎమ్మేల్యే తెల్లం బాలరాజు అధికారులను అప్రమత్తం చేశారు.
ఏలూరు: ఎడతెరపి లేని భారీ వర్షాలు(Heavy rains), గోదావరికి వరద ప్రవాహం ఉధృతమవుతున్న నేపథ్యంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు(Tellam balaraju) అధికారులను అప్రమత్తం చేశారు. సోమవారం ఉదయం పలుశాఖల అధికారులతో భేటీ అయిన ఎమ్మెల్యే... నియోజకవర్గంలో పరిస్థితులు, ప్రత్యేకించి గోదావరి పరివాహక ముంపు మండలాలు కుక్కునూరు, వెలేరుపాడు, పోలవరంలలో నెలకొన్న పరిస్థితులపై చర్చించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి పరిస్థితిని బట్టి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని కోరారు. కాజ్ వేలు, ప్రమాదకర వంతెనల వద్ద పికెట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.. అత్యవసర వాహనాలు, అంబులెన్స్ల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఎక్కడైనా రహదారులపై చెట్లు, వృక్షాలు కూలితే తక్షణమే రహదారి రాకపొకలకు అనుకూలంగా వాటిని తొలగించాలని ఎమ్మెల్యే తెలిపారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షించి, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వరద ప్రభావ ప్రాంతాల ప్రజలకు రేషన్, కావాల్సిన మందులు అన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. డెలివరీ దగ్గరలో ఉన్న గర్భిణులను తక్షణమే ముంపు ప్రాంతాల నుండి సమీపంలోని సురక్షిత ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్(SDRF) బృందాలను ఏర్పాటు చేసి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలన్నారు. అదేవిధంగా ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కూడా అధికారులకు సహకరిస్తూ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోవాలని ఎమ్మెల్యే బాలరాజు ఆదేశించారు.