పోలవరం గరంగరం

ABN , First Publish Date - 2022-07-20T09:08:44+05:30 IST

ఒకపక్క గోదావరి వరద ప్రాంతాలు ఇంకా కోలుకోలేదు. పంటలు పోయాయి. తిండీ నీళ్లు లేవు. సహాయక చర్యల తీరు పట్ల బాధితుల్లో ఆక్రోశం...

పోలవరం గరంగరం

  • ఆ ప్రాజెక్టుతోనే భద్రాచలం మునక
  • సమయానికి ఏపీ వరదను వదల్లేదు
  • ఐదు ఊళ్లు ఇస్తే కరకట్ట నిర్మించుకుంటాం
  • రాముడి కోసం పోలవరం ఎత్తు తగ్గించండి
  • విలేకరుల సమావేశంలో పువ్వాడ వ్యాఖ్యలు
  • భగ్గుమన్న ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు 
  • భద్రాచలానికి వరద ముంపు కొత్త కాదు
  • డిజైన్‌కు అనుగుణంగానే పోలవరం నిర్మాణం
  • విభజనతో మేమూ ఆర్థికంగా నష్టపోయాం
  • రాష్ట్రాలను కలిపేద్దామని బొత్స ప్రతిపాదన
  • భద్రాచలం ఇస్తారా? అని అడిగిన రాంబాబు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ఒకపక్క గోదావరి వరద ప్రాంతాలు ఇంకా కోలుకోలేదు. పంటలు పోయాయి. తిండీ నీళ్లు లేవు. సహాయక చర్యల తీరు పట్ల బాధితుల్లో ఆక్రోశం... అసలు సమస్యను వదిలేసి రెండు తెలుగు రాష్ట్రాల నేతలు పరస్పర ఆరోపణలకు దిగారు. బాధితులకు తక్షణ సాయం ఏం చేయాలి? ఇలాంటి వరదలు వస్తే ఎదుర్కోవడానికి భవిష్యత్తులో ఏం చేయాలి? లాంటి అంశాలను పక్కనబెట్టి పోలవరం ఎత్తు, ఏపీకి బదలాయించిన గ్రామాలను వెనక్కివ్వడం, ఉమ్మడి రాజధాని వంటి రాష్ట్ర విభజన సమస్యలను తెర మీదకు తెచ్చి సవాళ్లు  విసురుకుంటున్నారు. పోలవరం ఎత్తు తగ్గించాలని డిమాండ్‌ చేయడం ద్వారా సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం పిల్లి మెడలో గంట కట్టారు. దాంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో వెనుక బడతామేమోనన్న భయమో ఏమో మంత్రి పువ్వాడ అజయ్‌ నేతృత్వంలో జిల్లా టీఆర్‌ఎస్‌ ముఖ్యులంతా హైదరాబాద్‌కు తరలి వచ్చారు. విలేకరుల సమావేశం పెట్టారు. పోలవరం నుంచి నీళ్లు వదలడంలో ఏపీ నిర్లక్ష్యం చేసినందువల్లే భద్రాచలం ప్రాంతం వరద నీటిలో మునిగిపోయిందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ ఆరోపించారు. ఇరు రాష్ట్రాల ప్రజల ఆరాధ్య దైవమైన భద్రాచలం రామచంద్రస్వామికి వరద ముప్పు లేకుండా చూడటానికి పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలని, గోదావరిపై కరకట్ట నిర్మాణానికి వీలుగా భద్రాచలం పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణకు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని కేంద్రాన్ని కోరతామన్నారు. విభజన చట్టం ఆధారంగా కడుతున్న ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ బదులిచ్చారు. విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు హైదరాబాద్‌ను ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా నష్టపోయిందని, ఇప్పుడు హైదరాబాద్‌ను ఏపీకి ఇవ్వమని అడగగలమా? అని ప్రశ్నించారు. ఏపీ ముంపు గ్రామాల్లో సహాయక చర్యల గురించి బాధ్యత కలిగిన వ్యక్తిగా తెలంగాణ మంత్రి మాట్లాడకుండా ఉంటే మంచిదని వ్యాఖ్యానించారు. ముంపు సమస్యను తెలంగాణ లోక్‌సభలో లేవనెత్తితే తాము ఇరు రాష్ట్రాలను కలపాలన్న డిమాండ్‌ను తెర మీదకు తెస్తామని అన్నారు. భద్రాచలం ప్రస్తుత వరదకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధమే లేదని, అది ఇప్పట్లో పూర్తయ్యే ప్రాజెక్టు కూడా కాదని ఏపీ నీటి పారుదల మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.


చిచ్చుపెట్టేలా అజయ్‌ వ్యాఖ్యలు: బీజేపీ

విపత్కర పరిస్థితిలో కూడా టీఆర్‌ఎస్‌ బురద రాజకీయాలు చేస్తోందని ఽబీజేపీ నేత సుభాష్‌ ధ్వజమెత్తారు. అజయ్‌ వ్యాఖ్యలు ఏపీ, తెలంగాణ మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని ఆరోపించారు. వరదనష్టంపై బండి సంజయ్‌ విజ్ఞప్తి మేరకు కేంద్ర హోంమంత్రి కమిటీని ఏర్పాటు చేశారని, ఈ కమిటీ కోరిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే జాతీయ విపత్తుల నిధి కింద  సాయం అందుతుందని చెప్పారు.


తప్పుడు ప్రచారం వద్దు

ఢిల్లీలోనూ ఇరు రాష్ట్రాల అధికార పార్టీల ఎంపీలు మాటల యుద్ధానికి దిగారు. గోదావరి వరదలకు చాలా అంశాలు కారణమని వైసీపీ ఎంపీలు వంగా గీత, అయోధ్య రామిరెడ్డి అన్నారు. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిండిపోయిందన్నారు. కేంద్రం నిధులతో నిర్మించే ప్రాజెక్టు గురించి తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. ఎత్తు ఎంత పెంచారు, నీళ్ల సామర్థ్యం ఎంత, నీళ్ల వివాదం ఏంటి? అనేవి తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని టీఆర్‌ఎస్‌ ఎంపీలు రంజిత్‌రెడ్డి, వెంకటేష్‌ నేత అన్నారు. గోదావరి నీటిని తాత్కాలికంగానైనా చెరిసగం చొప్పున పంచాలని కోరారు.


నా మాటల్లో తప్పేంటి?

ఏపీ నేతల స్పందన తర్వాత సాయంత్రం పువ్వాడ మరోసారి మీడియాతో మాట్లాడారు. ఏపీ మంత్రుల వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజల కోసం మాట్లాడిన వ్యాఖ్యలను వక్రీకరించి, విమర్శించడం సరికాదన్నారు. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఐదు విలీన గ్రామాలను కేటాయించాలని కోరితే.. హైదరాబాద్‌ ఇస్తారా అనటం.. అసందర్భం.. అర్థరహితమని అజయ్‌ పేర్కొన్నారు. జగన్‌తో చర్చించి భద్రాచలం రాముడి కోసం 5 గ్రామాలను ఇప్పించాలని కోరారు. వరద బాధితుల కోసం కేసీఆర్‌ వెయ్యి కోట్ల సాయం ప్రకటించడం పట్ల పువ్వాడ కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్‌కు వరద సాయం చేసిన కేంద్రం తెలంగాణకు ఇప్పటి వరకు సాయం ప్రకటించలేదన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన రాష్ట్ర గవర్నర్‌ కేంద్రం సాయం అందించేందుకు ప్రతిపాదనలను పంపాలని కోరారు.


పోలవరంపైనే అనుమానం?

పోలవరం నిర్మాణం మొదలయ్యాక గోదావరి నడక మారిందని స్థానికులు, ఇంజనీర్లు అంటున్నారు. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహ ఒరవడి గతంకంటే కొంత నెమ్మదిగా ఉండడం, వరద తగ్గడానికి కూడా ఎక్కువ సమయం పట్టడంతో.... ఇదంతా పోలవరం ప్రభావమేనని స్థానికుల్లో అనుమానాలు పెరిగాయి. వారి గొంతునే అధికార పార్టీ నేతలు హైదరాబాద్‌లో వినిపించారు. విలేకరుల సమావేశం అనంతరం నేతలు ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. 


కేంద్రం చొరవ చూపాలి 

- పువ్వాడ అజయ్‌కుమార్‌

రాష్ట్ర మంత్రి పువ్వాడ మంగళవారం హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష కార్యాలయం లో ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి విలేకరుల సమావేశం లో మాట్లాడారు. ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతమధు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, ఎం.నాగేశ్వర్‌రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోలవరం ప్రా జెక్టు ఎత్తు తగ్గించాలని మొదటి నుంచి తాము డి మాండ్‌ చేస్తున్నామని, ఏపీ సర్కారు పట్టించుకోవడం లేదని పువ్వాడ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాథమిక డిజైన్‌ మార్చి మూడు మీటర్ల ఎత్తు పెంచుకున్నారని, దాన్ని తగ్గించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. గోదావరి కరకట్టల పటిష్టం పై ఏపీ సర్కారు దృష్టి సారించడం లేదని, దాంతో భ ద్రాచలం ఎగువన ఏపీ నిర్వహణలో ఉన్న ప్రాంతంలో కరకట్ట లీకేజీ ద్వారా పట్టణంలోకి వరద ప్రవేశించిందని చెప్పారు. ఆ ప్రాంతంలో ఏపీకి చెందిన ఐదు గ్రామాలు ఉన్నాయని, వాటిని తెలంగాణకు ఇవ్వాలని కోరారు. దానికి కేంద్రం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.  ఏడు మండలాలను ఆంధ్రాలో కలపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తాము ఆదిలోనే నిరసన తెలిపామన్నారు. 


ముంపు కొత్త కాదు: బొత్స

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిలో విలేకరులతో మాట్లాడారు. పోలవరం ఎత్తు పెంచడం వల్ల భద్రాచలం మునిగిందంటే ఎలా అని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులు ఒరిజనల్‌ డిజైన్‌ప్రకారమే చేస్తున్నారని చెప్పారు. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఏమీ చేయలేమని గుర్తు చేశారు. భద్రాచలానికి ముంపు కొత్త కాదని, వందేళ్ల తర్వాత మొదటిసారి గోదావరికి ఇంత వరద వచ్చిందని చెప్పారు. సాంకేతికంగా ఏదైనా ఇబ్బంది వస్తే అడగాలే తప్ప అవివేకపు మాటలు మాట్లాడొద్దని అన్నారు. సమస్య లేకుండా ఎలా అనేది చూసుకోవాలే తప్ప రెచ్చగొట్టే మాటలు సరి సరికాదన్నారు. పక్కనున్నది పాకిస్తాన్‌ ప్రభుత్వమేమీ కాదు కదా.. ఆంధ్రాతో సెటిల్‌ చేసుకుంటామని కేసీఆర్‌ వ్యాఖ్యానించిన విషయాన్ని మీడియా ప్రస్తావించగా.. పూర్తిగా స్వాగతిస్తామన్నారు. పోలవరం ముంపు గ్రామాలను ఏపీ ప్రభుత్వం పట్టించుకో లేదని పువ్వాడ అన్నట్లుగా కొందరు విలేకరులు ప్రస్తావించగా, ‘‘రాష్ట్రంలో విలీనమైన మండలాల బాధ్యత మాది. ఖమ్మం జిల్లాలో ముంపు సంగతి అయన్ని చూసుకోమనండి. పక్క రాష్ట్రాల గురించి మాట్లాడటం బాధ్యతగల వ్యక్తులకు తగదు’’ అన్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో విలీనానికి సంబంధించి డిమాండ్‌ తీసుకొస్తామన్న టీఆర్‌ఎస్‌ నేతల వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ.. ‘‘మంచిది. తీసుకురమ్మనండి. విభజిత రాష్ట్రాన్ని మళ్లీ కలిపేయాలన్న డిమాండ్‌ను మేం కూడా తీసుకొస్తాం’’ అని బదులిచ్చారు.


ఎవరు చెప్పింది నమ్మాలి? రేవంత్‌

పోలవరం విషయంలో కేసీఆర్‌ చెప్పింది నమ్మాలా? మంత్రి పువ్వాడ చెప్పింది నమ్మాలా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. అసలు సమస్యను పక్కదోవ పట్టించేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వరదలకు రాష్ట్రంలో 11 లక్షల హెక్టార్లలో పంట నీటి పాలైతే మొదట విదేశీ కుట్ర అన్న కేసీఆర్‌ ఇప్పుడు పక్క రాష్ట్రాల కుట్ర అంటున్నారని ఎద్దేవా చేశారు. వరద మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. నష్టంపై కేంద్రానికి సంపూర్ణ నివేదిక పంపాలని, ఢిల్లీకి వచ్చి ఒత్తిడి తెచ్చి రూ.2000 కోట్ల సాయం రాబట్టాలని కోరారు. రాష్ట్రంలో జరిగిన అవినీతిపై చర్చ జరగకుండా కేసీఆర్‌ విదేశీ కుట్రను తెర మీదకు తెచ్చారని ఆరోపించారు. వరద సాయం చేయని బీజేపీ 21 నుంచి ఊళ్లకు వస్తోందని ఎక్కడికక్కడ అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


ప్రభుత్వం నిద్ర పోతోందా?: భట్టి

పోలవరం ఎత్తు పెంచుతుంటే తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతోందా అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. పోలవరం కాఫర్‌ డ్యామ్‌ ఎత్తును మూడు మీటర్లు పెంచి కట్టడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందని తెలిసి కూడా ప్రభు త్వం ఎందుకు బాధ్యతా రహితంగా ఉందని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం పోలవరం ఎత్తు పెంచుతుంటే గూగుల్‌లో కేసీఆర్‌కు కనపడలేదా అన్నారు. పోలవరం ముంపులోని ఏడు మండలాలను ఏపీలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపారా? ఏం సమాధానం వచ్చింది? ఈ అంశంపైప్రధానిని ఎన్ని సార్లు కలిశారు? ఆర్డినెన్స్‌ రద్దు చేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి తేవడం కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్లలేదు?’’ అంటూ ప్రశ్నించారు. ఏడు మండలాలు ఏపీలో కలపకుంటే ఇప్పుడు కరకట్ట సమస్య వచ్చేదే కాదన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులపై సాంకేతిక కమిటీ వేసి.. సమగ్ర నివేదికను రూపొందించాలన్నారు.


భద్రాచలం ఇచ్చేస్తారా?

- అంబటి రాంబాబు 

పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని ఏపీ జల వనరుల మంత్రి అంబటి రాంబాబు అన్నారు.  దశలవారీగా పూర్తి చేస్తామని మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులకు తెలిపారు. పోలవరం ఎత్తు మరో మూడు మీటర్లు పెంచుతున్నామన్నది వాస్తవం కాదన్నారు. భద్రాచలం మునకకు పోలవరం కారణం కాదని చెప్పారు. పోలవరం ఎగువన 45.72 మీటర్ల కాంటూరులో నీళ్లు నిలిపేందుకు కేంద్రం నుంచి అనుమతి ఉందని, తెలంగాణలోని ఏడు మండలాలు అందులో ఉండటంతో ఏపీకి కలిపారని తెలిపారు. భద్రాచలం చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాలు కావాలంటే కేంద్రాన్ని అడగాలని, భద్రాచలాన్ని తమకు ఇచ్చినా అభ్యంతరం లేదని చెప్పారు. 

Updated Date - 2022-07-20T09:08:44+05:30 IST