పోడు రైతుల నిరీక్షణ

ABN , First Publish Date - 2022-05-20T06:02:41+05:30 IST

పోడు రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. హక్కు పత్రాల కోసం అరు నెలలుగా ఎదురు చూపులే మిగిలాయి.

పోడు రైతుల నిరీక్షణ

- సర్కారుకు చేరిన సిఫార్సులు

- మార్గదర్శకాలకు ఎదురుచూపులు    

- ఆరు నెలలు గడుస్తున్నా నెరవేరని ఆశలు 

- జిల్లాలో 67 గ్రామాల్లో పోడుభూముల సమస్య

 (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

పోడు రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. హక్కు పత్రాల కోసం అరు నెలలుగా ఎదురు చూపులే మిగిలాయి. గత సంవత్సరం డిసెంబరులోనే పోడుభూములకు సంబంధించిన రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశగా ఎదురు చూస్తున్నా రైతులకు మాత్రం నిరాశే మిగిలింది.  జిల్లాలో ఎనిమిది మండలాలు, 67 గ్రామాల్లో పోడు సమస్య ఉన్నట్లు గుర్తించారు. దరఖాస్తులు స్వీకరించి ఆన్‌లైన్‌లో భద్రపరిచారు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో పోడు సమస్య ప్రక్రియకు మోక్షం కలగడం లేదు. జిల్లాలో ప్రధానంగా గిరిజనుల కంటే గిరిజనేతరుల నుంచి దరఖాస్తులు ఎక్కువగా రావడం గమనార్హం. 

జిల్లాలో 13 మండలాలు ఉండగా పోడు సమస్య ఉన్న 8 మండలాల్లోని 67 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించారు. జిల్లాలో 2005కు పూర్వం, 434.80 ఎకరాల భూమి పోడుకు గురికాగా తరువాత 7,588.40 ఎకరాల్లో ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. నవంబరులో సర్పంచ్‌ అధ్యక్షతన గ్రామ కార్యదర్శి, రెవెన్యూ సహాయకలు, అటవీ బీట్‌ అధికారి, మండల సర్వేయర్లతో బృందాలు ఏర్పాటు చేసి గ్రామాల వారీగా గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. ప్రస్తుతం జిల్లా స్థాయిలో అధికారులు దరఖాస్తుల పరిశీలనకు కసరత్తు పూర్తి చేసి పరిశీలన నిమిత్తం ప్రభుత్వానికి పంపించారు. వీటిని పూర్తి స్థాయిలో పరిశీలించి అర్హత ఉన్నవారికి హక్కు పత్రాలు అందించాల్సి ఉంది. పోడుభూములపై ఆధారపడి ఉన్నవారి కుటుంబాల్లో ప్రభుత్వ ఉద్యోగమున్నా అనర్హులుగానే చూస్తున్నారు. గిరిజనులు అయితే 25 ఏండ్ల పాటు, గిరిజనేతరులయితే 75 ఏండ్ల పాటు పోడు సాగు చేస్తున్నట్లు ఆధారాలు చూపించాల్సి ఉంది. రైతు కుటుంభానికి గరిష్టం పది ఎకరాలకు మించి ఉన్నా దానిని స్వాధీనం చేసుకోవాలని సర్కారు నిర్ణయించింది. దరఖాస్తు దారుల్లో గిరిజనేతరులు అధికంగా ఉండడంతో 75 ఏండ్ల ఆధారాలు తేవడం ఎలా సాధ్యమనేది కొత్త సమస్యగా మారింది. 

- ఆర్‌వోఎఫ్‌ఆర్‌ చట్టం పరిధిలోనే.. 

అటవీ హక్కుల గుర్తింపు చట్టం పరిధిలోనే పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వనున్నారు. 29 డిసెంబర్‌ 2006 నుంచి ఆర్‌వోఎఫ్‌ఆర్‌ చట్టం అమల్లోకి వచ్చింది. 2005కు ముందు సాగులో ఉన్న గిరిజనులకు మాత్రమే హక్కు పత్రాలు జారీ చేయనున్నారు. ప్రస్తుతం సాగులో ఉన్నవారిని గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు ముందుకు వెళ్లనున్నారు. రెవెన్యూ రికార్డుల్లో తప్పుడు పత్రాలతో రికార్డయిన భూములు కూడా ఉన్నాయి. అటవీ  హక్కుల చట్టం ప్రకారం గిరిజనేతర కుటుంబాలకు గరిష్టంగా పదెకరాల వరకే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం మూడు తరాలు సాగులో ఉంటేనే హక్కు పత్రాలు ఇస్తారు. ఇప్పటికే గతంలో జిల్లాలో కొంత మందికి హక్కు పత్రాలను అందించారు. 587 ఎకరాల్లో 380 మంది రైతులకు హక్కు పత్రాలు ఇచ్చారు. తాజాగా ప్రభుత్వం మరో అవకాశం ఇవ్వడంతో ఇటీవల పోడు చేసుకున్న వారు కూడా దరఖాస్తులు చేసుకున్నారు. 

-  గిరిజనేతరులే అధికం.. 

జిల్లాలో పోడు భూముల సమస్య 2910 మంది రైతులు 8023 ఎకరాల్లో ఉందని అధికారులు గుర్తించి సదస్సులు నిర్వహించారు. సదస్సుల్లో మాత్రం 14,031.23 ఎకరాలకు సంబంధించి 5,940 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో ఎస్టీలు 77,85.31 ఎకరాలకు సంబంధించి 2,842 మంది, ఇతరులు 6,245.32 ఎకరాలకు సంబంధించి 3,098 మంది దరఖాస్తులు చేసుకున్నారు. గిరిజనుల కంటే ఇతరులు ఎక్కువగా ఉన్నారు. దరఖాస్తుల పరిశీలన పెండింగ్‌లో ఉండడంతో ఎప్పుడు పట్టాలు వస్తాయోనని ఎదురు చూస్తున్నారు.


Updated Date - 2022-05-20T06:02:41+05:30 IST