పోచంపల్లి చేనేత వస్త్ర కళ అద్భుతం
ABN , First Publish Date - 2022-08-13T05:57:09+05:30 IST
చేనేత వస్త్రకళ అత్యద్భుతమని ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆస్ట్రేలియా ప్రతినిధి మనీష్ గుప్తా ప్రశంసించారు.
ఇండియన్ కాన్సులేట్ జనరల్, ఆస్ట్రేలియా ప్రతినిధి మనీష్ గుప్తా
భూదాన్పోచంపల్లి, ఆగస్టు 12: చేనేత వస్త్రకళ అత్యద్భుతమని ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆస్ట్రేలియా ప్రతినిధి మనీష్ గుప్తా ప్రశంసించారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఇండియన్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్తోపాటు ఇండియన్ హ్యాండ్లూమ్ విభాగం ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో వస్త్రప్రదర్శన నిర్వహించారు. చేనేత వస్త్ర పరిశ్రమను ప్రపంచానికి చాటేవిధంగా అక్కడి పవర్హౌస్ మ్యూజియంలో ‘చరఖా కార్గా’ మగ్గంపై వస్త్ర తయారీ ప్రక్రియను ప్రదర్శించేందుకు ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్లో పోచంపల్లి ఇక్కత్ వస్త్ర కళకు సంబంధించిన మగ్గం నేయడం, చిటికీ చుట్టడం, రంగులు అద్దడం వంటి అంశాలను భూదాన్పోచంపల్లికి చెందిన చేనేత టైఅండ్డై అసోసియేషన్ అధ్యక్షుడు తడక రమేష్ వివరించారు. కార్యక్రమానికి ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆస్ట్రేలియా ప్రతినిధి మనీష్ గుప్తా హాజరై ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా మనీ్షగుప్తా మాట్లాడుతూ చేనేత వస్త్రకళలో ఎంతో వైవిధ్యం ఉందని, పోచంపల్లి ఇక్కత్ డిజైన్లకు విశ్వవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. వారి వెంట అసోసియేషన్ ప్రతినిధి పాలాది యాదగిరి ఉన్నారు.