ఒక్కసారి అవకాశం ఇవ్వండి...!
ABN , First Publish Date - 2022-06-18T15:14:37+05:30 IST
రాష్ట్రంలో 62 ఏళ్లుగా రెండు పార్టీల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, తమకు ఒక్క అవకాశం కల్పిస్తే మార్పులు తీసుకొస్తామని పీఎంకే
- పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి
పెరంబూర్(చెన్నై), జూన్ 17: రాష్ట్రంలో 62 ఏళ్లుగా రెండు పార్టీల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, తమకు ఒక్క అవకాశం కల్పిస్తే మార్పులు తీసుకొస్తామని పీఎంకే అధ్యక్షుడు డా.అన్బుమణి రాందాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కడలూరు జిల్లా చిదంబరంలో పార్టీ నిర్వాహకుడి ఇంటి శుభకార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, పార్టీ చేపట్టిన ‘2.0’ పథకం ప్రజల సంక్షేమం కోసమన్నారు. ప్రాథమిక విద్య నుంచి కళాశాల వరకు ఉచిత విద్య, ఆస్పత్రుల్లో మౌలికవసతులు కల్పించి ఎలాంటి శస్త్రచికిత్సలు అయినా ఉచితంగా నిర్వహించడం, రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగావకాశాలు కల్పించడం పార్టీ అజెండాగా ఉందన్నారు. ఆన్లైన్ జూదానికి మరొకరు బలయ్యారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ క్రీడలను నిషేధించేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని అన్బుమణి డిమాండ్ చేశారు.