పీఎంజీకేఏవై బియ్యం రాకలో జాప్యం
ABN , First Publish Date - 2021-07-16T05:42:10+05:30 IST
ప్రధానమంత్రి గ్రామీణ్ కల్యాణ్ అన్న యోజన కార్యక్రమం కింద గురువారం(ఈ నెల 15) నుంచి ప్రారంభం కావాల్సిన బియ్యం పంపిణీ జిల్లాలో చాలా చోట్ల జరగలేదు.
రేషన్ దుకాణాలకు వెళ్లి వెనుతిరిగిన కార్డుదారులు
ఈ నెల 18 నుంచి ప్రారంభిస్తామని జేసీ ప్రకటన
గుంటూరు, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి గ్రామీణ్ కల్యాణ్ అన్న యోజన కార్యక్రమం కింద గురువారం(ఈ నెల 15) నుంచి ప్రారంభం కావాల్సిన బియ్యం పంపిణీ జిల్లాలో చాలా చోట్ల జరగలేదు. వివిధ జిల్లాల నుంచి ఎఫ్సీఐ ద్వారా కేటాయించిన నాన్ సార్టెక్స్ బియ్యం జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్లకు రాలేదు. అరకొరగా వచ్చిన బియ్యాన్ని వచ్చినట్లు షాపులకు పంపించారు. ఈ విషయం తెలియక చాలామంది కార్డుదారులు గురువారం ఉదయాన్నే రేషన్ దుకాణాలకు వెళ్లి అక్కడ బియ్యం పంపిణీ ప్రారంభం కాకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు. పలు దుకాణాలకు ఏ తేదీ నుంచి బియ్యం పంపిణీ ప్రారంభించాలో కూడా అధికారులు చెప్పని పరిస్థితి నెలకొన్నది. కాగా గురువారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ దీనిపై సమీక్ష నిర్వహించారు. సాధ్యమైనంత త్వరగా ఎఫ్సీఐ నుంచి బియ్యం తెప్పించి షాపులకు పంపించాలన్నారు. ఈ నెల 18 నుంచి బియ్యం పంపిణీని ప్రారంభిస్తామన్నారు. జిల్లాలోని 14.8 లక్షల రైస్కార్డుదారులకు బియ్యం పంపిణీ జరుగుతుందన్నారు.
వారం పైగా నిలిచిన ఏఈపోస్ వెబ్సైట్
హైదరాబాద్లోని స్టేట్ డేటా సెంటర్లో ఈ నెల 9 నుంచి హైఎండ్ యూపీఎస్ పునస్థాపన కారణంగా జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఈ-పోస్ సేవలను నిలిపేశారు. స్టేట్ డేటా సెంటర్లో ఇంకా పని పూర్తి కానందున ఏఈపోస్ వెబ్సైట్ స్తంభించిపోయింది. ఈ కారణంగా ట్రక్కుషీట్లు రిసీవ్డ్ కావడం లేదు. వెబ్సైట్ నిలిచిన కారణంగా ఇప్పటికే మంజూరు చేసిన కొత్త రైస్కార్డులకు సరుకుల కేటాయింపు జరగడం లేదు. అలానే కొత్త రేషన్కార్డు కోసం దరఖాస్తు చేసుకొన్న అర్జీలు కూడా పరిష్కారం కావడం లేదు. ఎప్పటిలోపు వెబ్సైట్ పునరుద్ధరణ జరుగుతుందో అధికారులు చెప్పలేకపోతున్నారు.