నిజాయితీగా పన్ను చెల్లించే వారికోసం కేంద్రం సరికొత్త విధానం
ABN , First Publish Date - 2020-08-13T18:44:03+05:30 IST
పన్ను చెల్లింపుదారుల కోసం కేంద్ర ప్రభుత్వం మరింత సరళమైన, సౌకర్యవంతమైన విధానాన్ని..
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల కోసం కేంద్ర ప్రభుత్వం మరింత సరళమైన, సౌకర్యవంతమైన విధానాన్ని ప్రకటించింది. పన్ను చెల్లింపుదారులు స్క్రుటినీ కోసం, అప్పీళ్ల కోసం నేరుగా హాజరయ్యే అవసరం లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఓ సరికొత్త వేదికను ప్రారంభించారు. సకాలంలో పన్ను బకాయిలు చెల్లించి దేశ నిర్మాణం కోసం తోడ్పాటు అందించాలని ప్రధాని ఈ సందర్భంగా ప్రజలను అభ్యర్థించారు. అటు పన్ను చెల్లింపుదారులు, ఇటు అధికారులకు సంబంధించిన హక్కులు, బాధ్యతలను నిర్దేశించే ‘‘పన్ను చెల్లింపుదారుల చార్టర్’’ కూడా ఐటీ శాఖ అమలుచేయనుంది. ‘‘పారదర్శక పన్ను విధానం- నిజాయితీపరులకు గౌరవం’’ పేరుతో ప్రధాని మోదీ ఈ వేదికను ప్రారంభించారు. వచ్చే నెల 25 నుంచి ఫేస్లెస్ అప్పీళ్లు (నేరుగా హాజరుకాకుండా) ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. అతి తక్కువ కార్పొరేట్ పన్నులను వసూలు చేసే దేశాల్లో భారత్ కూడా ఒకటనీ.. భారత పన్ను వ్యవస్థలో ప్రాథమిక సంస్కరణలు అవసరమని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.