త్వరలో మోదీ అమెరికా పర్యటన!
ABN , First Publish Date - 2021-09-04T23:38:47+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో అమెరికాలో పర్యటించబోతున్నారు
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో అమెరికాలో పర్యటించబోతున్నారు. ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్తో భేటీ కాబోతున్నారు. ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా శనివారం తెలిపిన వివరాల ప్రకారం, మోదీ సెప్టెంబరు చివరి వారంలో అమెరికాలో పర్యటించే అవకాశం ఉంది. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ అమెరికా వెళ్తుండటం ఇదే తొలిసారి.
మోదీ, బైడెన్ సమావేశం తేదీలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబరు 22-27 మధ్యలో ఇరువురు నేతలు సమావేశమవుతారని తెలుస్తోంది. వీరిరువురు వర్చువల్ విధానంలో ఇప్పటి వరకు మూడుసార్లు చర్చలు జరిపారు. మార్చిలో క్వాడ్ సమ్మిట్ గురించి, ఏప్రిల్లో వాతావరణ మార్పుల సదస్సుపై, జూన్లో జీ-7 సదస్సుపై చర్చించారు.
ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో మోదీ, బైడెన్ సమావేశానికి చాలా ప్రాధాన్యం ఉంది. అమెరికా పర్యటన ఖరారైతే మోదీ ఆ దేశ ఉన్నత స్థాయి నేతలను కూడా కలుస్తారు.
మోదీ 2019 సెప్టెంబరులో అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే.