పీఎం మోదీకి నల్ల జెండాలతో నిరసన తెలపాలి
ABN , First Publish Date - 2022-07-01T06:14:26+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వస్తున్న సందర్భంగా ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ ప్రక్రియను తక్షణమే నిలుపుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రజలంతా నల్ల జెండాలతో నిరసనను తెలియజేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు పిలుపు
కూర్మన్నపాలెం, జూన్ 30: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు జూలై నాలుగున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వస్తున్న సందర్భంగా ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ ప్రక్రియను తక్షణమే నిలుపుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రజలంతా నల్ల జెండాలతో నిరసనను తెలియజేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కూర్మన్నపాలెం కూడలిలో ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 504వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అన్న నినాదాన్ని పీఎం దృష్టికి తీసుకువెళ్లేలా కార్మిక, విద్యార్థి, యువజన, మహిళా, మేధావులు, కవులు, కళాకారులు, సంఘటిత, అసంఘటిత సంఘాల నాయకులు, కార్మికులు అన్ని రాజకీయ పార్టీలతో కలిసి నల్ల జెండాలతో నిరసన తెలపాలని కోరారు. పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రధాని భీమవరం వస్తున్నందున విభజన హామీలు, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగింపు, సొంత గనుల ఏర్పాటు, తదితర సమస్యలను మోదీ దృష్టికి రాష్ట్రంలోని బీజేపీ నాయకులు, ప్రభుత్వ అధికారులు తీసుకువెళ్లాలని కోరారు. నాయకుడు కేఎస్ఎన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగాలు దేశానికి సైనికుల్లాంటివని, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి.ఆనంద్, గంగవరం గోపి, ప్రసాద్, ఈశ్వరరావు, అప్పలరాజు, వరప్రసాద్, డబ్ల్యూఎండీ, సేఫ్టీ విభాగ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
ఉక్కు రిలే నిరాహార దీక్షల కార్యాచరణ
ఉక్కుటౌన్షిప్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షల ఉద్యమ కార్యాచరణను ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు గురువారం ప్రకటించారు. జూలై ఒకటిన ఎస్ఎంఎస్-1, రెండున టీపీపీ, ఆర్ఈడీ, పీఎంఈ స్టోర్స్, ఎస్ఎండీ, మూడున కాంట్రాక్టు కార్మికులు దీక్షల్లో పాల్గొంటారు. నాలుగో తేదీన సింటర్ ప్లాంట్, ఐదున కోకోఓవెన్, ఆరున ఆర్ఎంహెచ్పీ, ఏసీఎస్, హెచ్ఆర్, ఏడున బ్లాస్ట్ ఫర్నేస్, ఎనిమిదిన ట్రాఫిక్, కనస్ట్రక్షన్స్, ఆర్ఎండీ, తొమ్మిదిన ఎస్ఎంఎస్-2, పదిన కాంట్రాక్టు కార్మికులు దీక్షలో పాల్గొంటారని పేర్కొన్నారు. అలాగే 11వ తేదీన ఎల్ఎంఎంఎం, ఎస్బీఎం, 12న ఎఫ్ఎండీ, ఈఎండీ, ఈఎన్ఎండీ, ప్లాంట్ డిజైన్, 13న డబ్ల్యూఆర్ఎం, 14న ఎస్ఎంఎస్-1, 15న ఎంఎంఎస్ఎం, ఎస్టీఎం, 16న సీఎంఎం, సీఆర్ఎంపి, సీఎంఈ, సీఈడీ, ల్యూబ్ అండ్ హైడ్రా, 17న కాంట్రాక్టు కార్మికులు పాల్గొంటారన్నారు. 18వ తేదీన సీవోసీసీపీ, 19న సింటర్ ప్లాంట్, 20న ఆర్ఎంహెచ్పీ, ఏసీఎస్, హెచ్ఆర్, 21న బ్లాస్ట్ ఫర్నేస్, 22న ఎస్ఎంఎస్-2, 23న ట్రాఫిక్, కనస్ట్రక్షన్స్, ఆర్ఎండీ, 24న కాంట్రాక్టు కార్మికులు దీక్షల్లో కూర్చుంటారని తెలిపారు. 25న ఇన్స్మెంటేషన్, క్యూఏటీడీ, డీఎన్డబ్ల్యూ, ఆర్ అండ్ డీ, డీ అండ్ ఈ, టెలికాం, ఈటీఎల్, 26న ఈఎస్ అండ్ ఎఫ్, ఆర్ఎస్ అండ్ ఆర్ఎస్, ఈఆర్ఎస్, భద్రత, టెక్సెల్, ఎస్ఎస్డీ, ఆగ్రో, 27న డబ్ల్యూఎండీ, యుటిలీటీస్, ఎస్ఎస్డీ, వీఎస్జీహెచ్, ఎస్టీఈడీ, అడ్మిన్, టీఏ, టీటీఐ, 28న ఎస్ఎంఎస్-1, 29న టీపీపీ, ఆర్ఈడీ, పీఈఎం. స్టోర్స్, ఎస్ఎండీ, 30న సీవోసీసీపీ, 31న కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొంటారన్నారు.