వ్యర్థాలతో అద్భుతాలు : మోదీ

ABN , First Publish Date - 2021-08-29T20:45:23+05:30 IST

సాధారణ సృజనాత్మక ఆలోచనలు గ్రామీణ భారతం అభివృద్ధికి ఎంతో

వ్యర్థాలతో అద్భుతాలు : మోదీ

న్యూఢిల్లీ : సాధారణ సృజనాత్మక ఆలోచనలు గ్రామీణ భారతం అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ, బిహార్‌లోని మధుబనిలో ఉన్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టిన ఓ పథకం గురించి ప్రస్తావించారు. దీనివల్ల రైతులు మాత్రమే కాకుండా పరిసర గ్రామాల్లో కాలుష్యం తొలగిందని చెప్పారు. 


ఈ విశ్వవిద్యాలయానికి చెందిన, వాతావరణ మార్పులపై అధ్యయన కేంద్రం ఓ మంచి పథకాన్ని అమలు చేస్తోందని చెప్పారు. సుఖేత్ మోడల్ అని పిలుస్తున్న ఈ పథకం రైతులకు సహాయపడటంతోపాటు సమీప గ్రామాలు కాలుష్య రహితమైనట్లు తెలిపారు. ఈ పథకంలో భాగంగా, పంట వ్యర్థాలు, ఆవు పేడ, వంట గదిలో వ్యర్థాలను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల నుంచి సేకరిస్తారన్నారు. వీటిని ఇచ్చినవారికి వంట గ్యాస్ కొనుక్కోవడానికి డబ్బులు చెల్లిస్తున్నారన్నారు. ఆర్గానిక్ వ్యర్థాలను వర్మీ కంపోస్ట్‌గా మార్చుతున్నారని చెప్పారు. మొక్కలు, పంటలకు  ఈ ఎరువు ఉపయోగపడుతుందన్నారు. 


సుఖేత్ పథకం వల్ల నాలుగు ప్రయోజనాలు ఉన్నాయన్నారు. గ్రామాలు కాలుష్యరహితం కావడం, ఇళ్లు పరిశుభ్రంగా ఉండటం, వంట గ్యాస్ కొనుక్కోవడానికి ప్రజలకు డబ్బు లభించడం, మెరుగైన రీతిలో సాగు చేయడానికి ఉపయోగపడే ఎరువులు రైతులకు లభించడం ఈ పథకం వల్ల కలుగుతున్న ప్రయోజనాలని వివరించారు. ఇటువంటి సాధారణ సృజనాత్మక ఆవిష్కరణల వల్ల గ్రామీణ భారతం అభివృద్ధి చెందుతుందని, స్వయం సమృద్ధి బాటలో ప్రజలు నడుస్తారని చెప్పారు. అన్ని గ్రామాల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయాలని పంచాయతీలను కోరారు. 


Updated Date - 2021-08-29T20:45:23+05:30 IST