‘జన ఔషధి’ ప్రోత్సాహకం పెరిగింది : మోదీ

ABN , First Publish Date - 2021-03-07T23:33:58+05:30 IST

జన ఔషధి కేంద్రాల్లో పేదలకు సైతం అందుబాటు ధరల్లో ఔషధాలు

‘జన ఔషధి’ ప్రోత్సాహకం పెరిగింది : మోదీ

న్యూఢిల్లీ : జన ఔషధి కేంద్రాల్లో పేదలకు సైతం అందుబాటు ధరల్లో ఔషధాలు లభిస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వ్యాధిగ్రస్థులు ఈ కేంద్రాల్లో ఔషధాలను కొనాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన 7,500వ జన ఔషధి కేంద్రాన్ని షిల్లాంగ్‌లో ప్రారంభించారు. జన ఔషధి దినోత్సవాల సందర్భంగా ఈ కేంద్రాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన లబ్ధిదారులతో మోదీ మాట్లాడారు. 


ప్రజలంతా తన కుటుంబ సభ్యులేనని మోదీ అన్నారు. ప్రజల కష్టాలను తన కుటుంబ సభ్యుల కష్టాలుగానే భావిస్తానన్నారు. అందుకే దేశ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. జన ఔషధి పథకం వల్ల పేదలపై వైద్య ఖర్చుల భారం తగ్గిందని తెలిపారు. జన ఔషధి కేంద్రాల్లో లభించే మందుల ధరలు పేదలకు అందుబాటులో ఉంటున్నాయని, ఆరోగ్యపరమైన సత్ఫలితాల కోసం అవసరమైన మందులను ప్రజలు ఈ కేంద్రాల్లోనే కొంటున్నారని తెలిపారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు మంచి మిత్రుడిగా జన ఔషధి యోజన మారిందన్నారు. ఈ పథకం సేవా మాధ్యమంగానూ, ఉపాధినిచ్చేదిగానూ రూపొందిందని చెప్పారు. ఆరేళ్ళ క్రితం మన దేశంలో కనీసం 100 జన ఔషధి కేంద్రాలైనా ఉండేవి కాదన్నారు. 10 వేల కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని సాధించగలమన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పేదలు, మధ్య తరగతి ప్రజలు ఖరీదైన మందులపై సంవత్సరానికి రూ.3,600 కోట్లు ఆదా చేయగలుగుతున్నారని చెప్పారు. 


సుమారు 1,000 జన ఔషధి కేంద్రాలను మహిళలు నడుపుతున్నారని, మహిళలు స్వయం సమృద్ధి సాధించడానికి ఈ పథకం దోహదపడుతోందని తెలిపారు. ఈ పథకాన్ని పోత్సహించేందుకు ప్రోత్సాహకాన్ని రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచినట్లు తెలిపారు. దళిత మహిళలు, ఆదివాసీ మహిళలకు అదనంగా రూ.2 లక్షలు ప్రోత్సాహకం ఇస్తున్నట్లు తెలిపారు. 


Updated Date - 2021-03-07T23:33:58+05:30 IST