నన్ను దీవించడానికి ముస్లిం సోదరీమణులు నెమ్మదిగా బయల్దేరుతున్నారు : మోదీ

ABN , First Publish Date - 2022-02-14T20:41:49+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మహా ఊపుతో

నన్ను దీవించడానికి ముస్లిం సోదరీమణులు నెమ్మదిగా బయల్దేరుతున్నారు : మోదీ

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మహా ఊపుతో రాబోతోందని తొలి విడత పోలింగ్, రెండో విడత ఓటింగ్ సరళిని బట్టి స్పష్టమవుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కాన్పూరులో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, రాష్ట్ర సత్వర అభివృద్ధి కోసం ప్రతి కులం, వర్గం సమైక్యంగా ఓటు వేస్తున్నారన్నారు. తనను దీవించేందుకు ముస్లిం సోదరీమణులు నెమ్మదిగా ఇళ్ళ నుంచి బయల్దేరుతున్నారని చెప్పారు. 


బీజేపీ ప్రభుత్వం-యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మళ్ళీ మహా ఊపుతో రాబోతోందని చెప్పారు. ఎలాంటి విభజన, అయోమయం లేకుండా ప్రతి కులం, ప్రతి వర్గం ప్రజలు ఉత్తర ప్రదేశ్ సత్వర అభివృద్ధి కోసం ఓటు వేస్తున్నారన్నారు. బీజేపీ జయకేతనాన్ని మన తల్లులు, సోదరీమణులు, ఆడ బిడ్డలు తమంతట తామే ఎగురవేస్తున్నారన్నారు. 


‘‘నా ముస్లిం సోదరీమణులు మోదీని ఆశీర్వదించాలని మానసికంగా సిద్ధమై, ఎలాంటి చప్పుడు లేకుండా, నెమ్మదిగా ఇంటి నుంచి బయల్దేరుతున్నారు’’ అని చెప్పారు. 


మాఫియా తిరిగి పుంజుకోవడం కోసం సమాజ్‌వాదీ పార్టీకి, అఖిలేశ్ యాదవ్‌కు మద్దతిస్తోందని ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్‌లో వంశపారంపర్యంగా కుటుంబ పాలన జరిగినపుడు రేషన్ కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయన్నారు. పేదలకు ఆహార ధాన్యాలు దక్కలేదన్నారు. లక్షలాది నకిలీ రేషన్ కార్డులను సృష్టించారన్నారు. డబుల్ ఇంజిన్ (మోదీ, యోగి) ప్రభుత్వం ఈ నకిలీ రేషన్ కార్డు స్కీమ్‌కు తెర దించిందన్నారు. నేడు కోట్లాది మంది ఉత్తర ప్రదేశ్ ప్రజలు ఉచితంగా రేషన్ సరుకులను పొందుతున్నారని చెప్పారు. పేద తల్లులు, సోదరీమణుల స్టవ్వులు ఇకపై ఆరిపోబోవని తెలిపారు. 


చిన్నకారు రైతుల సంక్షేమం గురించి కేవలం బీజేపీ మాత్రమే ఆందోళన చెందుతుందని చెప్పారు. చిన్నకారు రైతుల కోసం తాము పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ప్రారంభించామన్నారు. ప్రతి రైతు బ్యాంకు ఖాతాకు నేరుగా సొమ్ము పంపిస్తున్నామని చెప్పారు. 


Updated Date - 2022-02-14T20:41:49+05:30 IST