జలియన్వాలా బాగ్ అమరులకు మోదీ నివాళులు
ABN , First Publish Date - 2021-04-13T18:30:24+05:30 IST
జలియన్వాలా బాగ్ అమరుల ధైర్యసాహసాలు, పరాక్రమం, త్యాగశీలత ప్రతి భారతీయునికి
న్యూఢిల్లీ : జలియన్వాలా బాగ్ అమరుల ధైర్యసాహసాలు, పరాక్రమం, త్యాగశీలత ప్రతి భారతీయునికి శక్తిని ఇస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. జలియన్వాలా బాగ్ హింసాకాండలో అసువులుబాసినవారికి మంగళవారం ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం ఓ ట్వీట్ చేశారు.
జలియన్వాలా బాగ్ హింసాకాండ 1919 ఏప్రిల్ 13న జరిగింది. పంజాబ్లోని అమృత్సర్లో జలియన్వాలా బాగ్ ఉంది. స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ఇద్దరు ప్రముఖ నేతలు సత్యపాల్, సైఫుద్దీన్ల అరెస్టును ఖండిస్తూ, బైశాఖి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు, నిరసనకారులు ఇక్కడ శాంతియుతంగా సమావేశమయ్యారు. బ్రిటిష్ సైన్యానికి చెందిన కల్నల్ రెజినాల్డ్ డయ్యర్ మానవత్వాన్ని మరచి, క్రూరంగా వ్యవహరించాడు. నిరాయుధులైనవారిపై విచక్షణా రహితంగా మెషిన్ గన్లతో కాల్పులు జరిపించాడు. బ్రిటిష్ పాలకుల లెక్కల ప్రకారం, ఈ దారుణ సంఘటనలో 379 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో స్త్రీ, పురుషులు, బాలలు ఉన్నారు. దాదాపు 1,200 మంది గాయపడ్డారు. ఇతర ఆధారాల ప్రకారం ఈ కాల్పుల్లో 1,000 మందికి పైగా అసువులుబాసినట్లు తెలుస్తోంది.