పారదర్శకతే విజయసూత్రం

ABN , First Publish Date - 2022-08-16T10:16:11+05:30 IST

పారదర్శకతతో కూడిన ఎంపిక విధానమే క్రీడా రంగంలో భారత్‌ విజయసూత్రమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

పారదర్శకతే  విజయసూత్రం

ఆకాశమే హద్దుగా రాణిస్తున్న క్రీడాకారులు

స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ

న్యూఢిల్లీ :  పారదర్శకతతో కూడిన ఎంపిక విధానమే క్రీడా రంగంలో భారత్‌ విజయసూత్రమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ విషయంలో దేశం ఎంతో ముందడుగు వేసిందన్నారు. బంధుప్రీతి అనే ప్రతికూల ప్రభావం కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదని, ఓ దశలో ఆ ముప్పు క్రీడా రంగాన్నీ పట్టి పీడించిందని తెలిపారు. ‘రాజకీయాల్లో మాదిరిగానే బంధుప్రీతి క్రీడా రంగానికీ పాకింది. ఫలితంగా ఆటగాళ్ల ఎంపిక విషయంలో పారదర్శకత కొరవడింది. ఈ కారణంగానే ఎందరో క్రీడాకారుల ప్రతిభ వృథా అయింది’ అని 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటనుంచి  చేసిన ప్రసంగంలో ప్రధాని ఆవేదన వ్యక్తంజేశారు.


అలాంటి కష్టాలతో క్రీడాకారులు జీవితాంతం పోరాడాల్సి వచ్చిందన్నారు. కానీ ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆకాశమే హద్దుగా మన అథ్లెట్లు చెలరేగుతున్నారని చెప్పారు. స్వర్ణ, రజత పతకాల మెరుపులు మన యువ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయని తెలిపారు. ‘ఇది ప్రారంభం మాత్రమే. భారత్‌ ఇక్కడితో ఆగిపోదు. అంతర్జాతీయ పోటీల్లో మనం ఎన్నో పసిడి పతకాలు సాధించే రోజు ఎంతో దూరంలో లేదు’ అని మోదీ అన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో భారత్‌ ఏడు పతకాలు (ఒక స్వర్ణం, రెండు రజతం, నాలుగు కాంస్యాలు) కైవసం చేసుకుంది. ఇటీవల జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో 22 పసిడి సహా 61 పతకాలతో మన అథ్లెట్లు ఔరా అనిపించారు. పెద్ద క్రీడా ఈవెంట్లకు ముందు, తర్వాత అథ్లెట్లతో భేటీ కావడం ద్వారా వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నాన్ని మోదీ చేస్తున్నారు. ‘రాజకీయాలు, క్రీడా సమాఖ్యలు సహా దేశంలోని అన్ని రంగాలనుంచి అవినీతిని తరిమేయాల్సిన అవసరం ఎంతో ఉంది’ అని మోదీ నొక్కి చెప్పారు.  

Updated Date - 2022-08-16T10:16:11+05:30 IST