వారణాసిలో రూ. 870 కోట్ల విలువైన 22 అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన

ABN , First Publish Date - 2021-12-23T21:45:47+05:30 IST

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పలు అభివృద్ధి పనులకు

వారణాసిలో రూ. 870 కోట్ల విలువైన 22 అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన

వారణాసి: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తన పార్లమెంటు నియోజకవర్గమైన వారణాసిలో మోదీ ఈ ఉదయం రూ. 870 కోట్ల విలువైన 22 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. గోవులను రక్షిస్తూ వాటిని కాపాడుతున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం గర్వపడుతుంటే.. ప్రతిపక్షాలకు అదే పాపమైందని ఎద్దేవా చేశారు.  


గోవులు, గేదెలపై జోకులు వేస్తున్నవారు వారిపై కోట్లాది జీవాలు ఆధారపడి ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోతున్నారని చురకలు అంటించారు. ఈ ఉదయం వారణాసి చేరుకున్న మోదీ.. కరిఖియాన్‌లోని  ఉత్తరప్రదేశ్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఫుడ్ పార్క్‌లో ‘బనారస్ డెయిరీ శంకుల్’కు శంకుస్థాపన చేశారు.


పాడి రంగంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించినట్టు చెప్పారు. గత ఆరేడేళ్లతో పోలిస్తే దేశంలో పాల ఉత్పత్తి దాదాపు 45 శాతం మేర పెరిగిందన్నారు. ప్రపంచంలోని పాల ఉత్పత్తిలో భారత్ 22 శాతం ఉత్పత్తి చేస్తోందని అన్నారు. దేశంలోనే ఉత్తరప్రదేశ్ అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తోందని, అంతేకాక, పాడి రంగాన్ని మరింతగా విస్తరిస్తున్నందుకు ఆనందంగా ఉందని మోదీ అన్నారు. కాగా, విద్య, ఆరోగ్యం తదితర రంగాలకు చెందిన పలు ప్రాజెక్టులను మోదీ ఆవిష్కరించారు. 

Updated Date - 2021-12-23T21:45:47+05:30 IST