వాగ్దానాలివ్వడంలో మోదీ దిట్ట : టీఎంసీ

ABN , First Publish Date - 2021-12-19T18:51:20+05:30 IST

వాగ్దానాలు ఇవ్వడంలో ప్రధాన మంత్రి నరేంద్ర చాలా గొప్పవారని, ఇచ్చిన వాగ్దానాలను

వాగ్దానాలివ్వడంలో మోదీ దిట్ట : టీఎంసీ

న్యూఢిల్లీ : వాగ్దానాలు ఇవ్వడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చాలా గొప్పవారని, ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడంలో ఆయన మరింత గొప్పవారని టీఎంసీ నేత, రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఒబ్రెయిన్ అన్నారు. ఎన్నికల ప్రచార సభల్లో మోదీ వాగ్దానాలు ఇస్తున్న తీరును దుయ్యబట్టారు. 


కోల్‌కతా నగర పాలక సంస్థ ఎన్నికల కోసం ఓటు వేసిన అనంతరం డెరెక్ ఒబ్రెయిన్ మాట్లాడుతూ, ‘‘ప్రధాన మంత్రి ఎక్కడకెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్లొచ్చు. వాగ్దానాలు ఇవ్వడం, వాటిని అమలు చేయడం రెండు వేర్వేరు అంశాలు. పీఎం వాగ్దానాలు చేయడంలో చాలా గొప్పవారు, వాటిని తుంగలో తొక్కడంలో మరింత గొప్పవారు’’ అని అన్నారు. దీపావళి తర్వాత, క్రిస్ట్‌మస్‌కి ఓ వారం ముందు తాము ప్రజాస్వామ్య పండుగను జరుపుకుంటున్నామన్నారు. గడచిన పదేళ్ళలో తాము చేసిన పనుల వల్ల తమను ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పారు. అత్యంత భారీ ఆధిక్యంతో తాము గెలుస్తామన్నారు. 


కోల్‌కతా నగర పాలక సంస్థ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన సమాచారం ప్రకారం, తొలి మూడు గంటల్లో 9.14 శాతం మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 


ఇదిలావుండగా, పోలింగ్ సందర్భంగా అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఆరోపించింది. పోలింగ్ స్టేషన్లలో అమర్చిన సీసీటీవీ కెమెరాలు పని చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అక్రమాలపై ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినవారిపై భౌతిక దాడులు జరుగుతున్నాయని ఆరోపించింది.


Updated Date - 2021-12-19T18:51:20+05:30 IST