కోవిడ్-19 మహమ్మారిపై మోదీ సమగ్ర సమీక్ష

ABN , First Publish Date - 2021-05-06T22:30:58+05:30 IST

దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం

కోవిడ్-19 మహమ్మారిపై మోదీ సమగ్ర సమీక్ష

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం సమీక్షించారు. రాష్ట్రాలు, జిల్లాల వారీగా ఈ మహమ్మారి పరిస్థితిని సమీక్షించారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో మౌలిక సదుపాయాలను పెంచాలని రాష్ట్రాలను కోరారు. రెమ్‌డెసివిర్ సహా మందులు, ఆక్సిజన్ లభ్యత గురించి తెలుసుకున్నారు. ఈ వివరాలను ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఓ ప్రకటనలో వెల్లడించింది. 


పీఎంఓ తెలిపిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి పరిస్థితిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం సమగ్రంగా సమీక్షించారు. వివిధ రాష్ట్రాల్లోని పరిస్థితులను అధికారులు సవివరంగా ఆయనకు తెలియజేశారు. యాక్టివ్ కేసులు ఒక లక్షకు పైగా ఉన్న 12 రాష్ట్రాల్లో పరిస్థితులను అధికారులు వివరించారు. ఈ వ్యాధి తీవ్రత పెనుభారంగా ఉన్న జిల్లాల్లో పరిస్థితులను కూడా తెలియజేశారు. 


సమస్యాత్మక జిల్లాలు...

రాష్ట్రాల్లో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల పెంపు గురించి కూడా మోదీకి అధికారులు వివరించారు. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి పరిపూర్ణంగా, వేగంగా తీసుకోవలసిన చర్యల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. సమస్యాత్మక జిల్లాలను గుర్తించాలని రాష్ట్రాలను కోరాలని మోదీ చెప్పారు. 10 శాతానికి పైగా పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలను, ఆక్సిజన్ లేదా ఐసీయూ బెడ్స్ 60 శాతానికి పైగా నిండిన జిల్లాలను సమస్యాత్మక జిల్లాలుగా పరిగణించాలని రాష్ట్రాలకు తెలియజేయాలని చెప్పారు. 


వ్యాక్సినేషన్ ప్రక్రియపై... 

మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియపై కూడా మోదీ సమీక్షించారు. రాష్ట్రాలకు 17.7 కోట్ల డోసుల వ్యాక్సిన్లను రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు అధికారులు మోదీకి తెలిపారు. 45 ఏళ్ళ వయసు పైబడినవారిలో సుమారు 31 శాతం మంది కనీసం ఒక మోతాదు వ్యాక్సిన్‌ను వేయించుకున్నట్లు తెలిపారు. రాష్ట్రాల వారీగా వ్యాక్సిన్లు వృథా అవుతున్న తీరును పరిశీలించారు. వ్యాక్సినేషన్ చురుగ్గా జరగాలని, ఈ వేగాన్ని తగ్గించకూడదని రాష్ట్రాలకు చెప్పాలని మోదీ ఆదేశించారు. అష్ట దిగ్బంధనాలు అమల్లో ఉన్నప్పటికీ వ్యాక్సినేషన్‌కు అంతరాయం కలుగకూడదని చెప్పారు. వ్యాక్సినేషన్‌లో పాల్గొనే హెల్త్‌కేర్ వర్కర్లను వేరొక విధులకు మళ్ళించరాదని తెలిపారు. 


ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మల సీతారామన్, డాక్టర్ హర్షవర్ధన్, పీయూష్ గోయల్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-06T22:30:58+05:30 IST