ఉద్యోగార్థులు కాదు.. కొలువుల సృష్టికర్తలు

ABN , First Publish Date - 2020-08-02T07:10:51+05:30 IST

నూతన జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ)పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ విధానం ఉద్దేశం ఉద్యోగార్థులను తయారు చేయడం

ఉద్యోగార్థులు కాదు.. కొలువుల సృష్టికర్తలు

  • కొత్త జాతీయ విద్యా విధానం లక్ష్యమిదే
  • చదువు, పరిశోధనలు, ఆవిష్కరణలే ముఖ్యం
  • స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌లో ప్రధాని మోదీ
  • ఎంఎల్‌ఆర్‌ విద్యార్థికి ప్రధాని అభినందనలు


న్యూఢిల్లీ, మేడ్చల్‌, దుండిగల్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): నూతన జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ)పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ విధానం ఉద్దేశం ఉద్యోగార్థులను తయారు చేయడం కాదని, ఉద్యోగ సృష్టికర్తలను ఉత్పత్తి చేయడమేనని ఆయన వివరించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులే లక్ష్యంగా ఎన్‌ఈపీని తీసుకొచ్చామన్నారు. శనివారం ఆయన ‘స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌-2020’ ఫినాలే కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ‘‘21వ శతాబ్దం విజ్ఞాన కేంద్రం. నేర్చుకోవడం, పరిశోధనలు చేయడం, ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి పెట్టాలి. వీటినే ఎన్‌ఈపీలో పొందుపరిచాం. యువత ఎప్పుడూ చదవడం, ప్రశ్నించడం, సమస్యలను పరిష్కరించడంలో నిమగ్నమవ్వాలి. నేర్చుకున్నప్పుడే ప్రశ్నించే తత్వం అలవడుతుంది’’ అని వ్యాఖ్యానించారు. బరువైన బ్యాగులకు స్వస్తి చెప్పి.. జీవితగమనంలో సాయపడే విద్యను అందించడమే ఎన్‌ఈపీ ప్రధానోద్దేశమని తెలిపారు. ‘‘భాష అనేది సున్నితమైన అంశం. ఎన్‌ఈపీలో స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా అవి కూడా అభివృద్ధి చెందుతాయి. ప్రపంచ ప్రమాణాలుండే విద్యలో స్థానిక భాషకు ప్రాధాన్యముంటుంది. అంటే.. ఒక విద్యార్థి అడుగు స్థానికం నుంచి విశ్వవ్యాప్తం అవ్వాలనేదే మా ఉద్దేశం’’ అని వివరించారు. ఇంటర్‌-డిసిప్లీనరీ పద్ధతిలో విద్యార్థులు తమకు నచ్చి సబ్జెక్టులో చదువుకోవచ్చన్నారు. ‘‘ఇది పాలసీ డాక్యుమెంటే కాదు. 130 కోట్ల మంది భారతీయుల కలలకు ప్రతిరూపం. తాము చదువుకున్న సబ్జెక్టును నిరర్థకంగా భావించే పరిస్థితి విద్యార్థుల్లో ఇకపై ఉండదు. ఎన్ని డిగ్రీలు చేసినా.. తమకు నచ్చిన సబ్జెక్టులను ఒకటిగా చదివే అవకాశం ఇప్పటి వరకు లేదు. మూస పద్ధతిలో సబ్జెక్టులను చదివే విద్యార్థుల జీవితంలో ఆత్మవిశ్వాసం కనుమరుగయ్యేది. ఇకపై అలా కాదు. 21వ శతాబ్ద యువత కోసం ఈ విధానాన్ని తీర్చిదిద్దాం’’ అని వివరించారు.


ఎంఎల్‌ఆర్‌ విద్యార్థికి ప్రశంసలు

అంతకు ముందు ప్రధాని మోదీ హ్యాకథాన్‌లో ఉత్తమ ఆవిష్కరణలతో ముందుకు వచ్చిన విద్యార్థులతో మాట్లాడారు. నేరాల నియంత్రణలో పోలీసులకు ఉపయుక్తంగా ఉండే ఆవిష్కరణను రూపొందించిన ఎంఎల్‌ఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(హైదరాబాద్‌) విద్యార్థిని మోదీ ప్రశంసించారు. ఈ కొత్త టెక్నాలజీతో ముఖాన్ని ముసుగుతో కప్పుకొన్నా.. నేరస్థులను కళ్ల ద్వారా గుర్తించవచ్చని ఆ విద్యార్థి చెబుతున్నప్పుడు ప్రధాని ఆసక్తిగా విన్నారు. ‘‘మిమ్మల్ని ఐపీఎ్‌సల శిక్షణ కేంద్రంతో అనుసంధానం చేస్తా. కచ్చితంగా మీ ఆవిష్కరణ వారికి ఉపయోగపడుతుంది’’ అని వ్యాఖ్యానించారు. వరదల సమయంలో ఆనకట్టలు తెగకుండా శ్రీకృష్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఓ పరిష్కార మార్గం కనిపెట్టినట్లుగా తన దృష్టికి వచ్చిందని మోదీ అన్నారు. రీయూజ్‌ శానిటరీ నాప్కిన్స్‌పై ప్రజెంటేషన్‌ ఇచ్చిన విద్యార్థిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వైద్య పరికరాల కోసం వర్చువల్‌ అసిస్టెన్స్‌ విధానంపై దృష్టిసారించిన విద్యార్థిని కూడా ఆయన మెచ్చుకున్నారు. 


మేడ్చల్‌లో రెండు నోడల్‌ కేంద్రాలు

కరోనా నేపథ్యంలో ఈ సారి స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌-2020ను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 40 నోడల్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. అందులో రెండు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో ఉండటం గమనార్హం. మేడ్చల్‌ జిల్లా కేంద్రంలోని సీఎంఆర్‌ సెట్‌, దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీలో నోడల్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హ్యాకథాన్‌లో దేశవ్యాప్తంగా 1,081 బృందాల్లో 9,500 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటున్నారు. 50 కేంద్ర, రాష్ట్ర విభాగాలు, మంత్రిత్వ శాఖలు సూచించిన 243 సమస్యలపై ఆవిష్కరణలకు ఈ బృందాలు పోటీపడుతున్నాయి. శనివారం వర్చువల్‌గా ప్రధాని ప్రసంగించిన కార్యక్రమంలో ఎంఎల్‌ఆర్‌ఐటీ కార్యదర్శి మర్రి రాజశేఖర్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ కె.శ్రీనివా్‌సరావు, సీఎంఆర్‌ సెట్‌ కరెస్పాండెంట్‌ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-08-02T07:10:51+05:30 IST