Prime Minister's Courtesy Call: కమెడియన్ రాజు శ్రీవాస్తవ కుటుంబ సభ్యులకు మోదీ ఫోన్

ABN , First Publish Date - 2022-08-12T19:44:03+05:30 IST

కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. శుక్రవారం కూడా

Prime Minister's Courtesy Call: కమెడియన్ రాజు శ్రీవాస్తవ కుటుంబ సభ్యులకు మోదీ ఫోన్

న్యూఢిల్లీ : కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. శుక్రవారం కూడా ఆయన అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (AIIMS)లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆయనకు సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందజేస్తున్నారు. ఆయన భార్యకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగానూ అండదండలు అందిస్తామని భరోసా ఇచ్చారు. 


రాజు శ్రీవాస్తవ 46 గంటలకు పైగా స్పృహలో లేరు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం రాజు భార్యకు ఫోన్ చేసి, అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎయిమ్స్ డైరెక్టర్‌కు ఫోన్ చేసి, రాజు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. 


రాజు శ్రీవాస్తవకు ఆగస్టు 9న వర్క్అవుట్ చేస్తుండగా గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ట్రెడ్‌మిల్‌పై వర్కవుట్ చేస్తుండగా ఉదయం 11 గంటల ప్రాంతంలో గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత ఆయన మెదడు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వార్తలు వచ్చాయి. 


బాలీవుడ్ ప్రముఖులను, రాజకీయ నేతలను అనుకరిస్తూ, హాస్యం పంచే రాజు శ్రీవాస్తవకు గొప్ప ప్రజాదరణ ఉంది. ది గ్రేట్ ఇండియన్ లాటర్ ఛాలెంజ్, కామెడీ కా మహా ముకాబలా, కామెడీ సర్కస్, కామెడీ నైట్స్ విత్ కపిల్ వంటి కామెడీ షోలలో ఆయన పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-12T19:44:03+05:30 IST