ఎర్ర కోట నుంచి నేను ఏం మాట్లాడాలో చెప్పండి : మోదీ

ABN , First Publish Date - 2021-07-30T18:46:27+05:30 IST

స్వాతంత్ర్య దినోత్సవాలనాడు ప్రజల భావాలు ఎర్రకోట నుంచి

ఎర్ర కోట నుంచి నేను ఏం మాట్లాడాలో చెప్పండి : మోదీ

న్యూఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవాలనాడు ప్రజల భావాలు ఎర్రకోట నుంచి ప్రతిధ్వనించబోతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలో ప్రజల ఆలోచనలకు స్థానం లభించబోతోంది. ప్రధాన మంత్రి కార్యాలయం శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ప్రజల భావాలు ఎర్రకోట నుంచి ప్రతిధ్వనిస్తాయని పేర్కొంది. ‘‘ఆగస్టు 15న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం కోసం మీ ఆలోచనలు ఏమిటి? @mygovindia ద్వారా మీ ఆలోచనలు పంచుకోండి’’ అని కోరింది.


MyGov.in పోర్టల్‌ ద్వారా కూడా ఈ పిలుపును ఇచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ ప్రసంగంలో తన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి వివరిస్తారని తెలిపారు. నాలుగేళ్ళ నుంచి నేరుగా ప్రజల ఆలోచనలు, సలహాలను కోరుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా ప్రజలు నవ భారతం కోసం తమ సలహాలను అందజేయాలని కోరారు. సలహాలకు అక్షర రూపం ఇచ్చి, తెలియజేయాలని కోరారు. ప్రజలు పంపించిన అంశాల్లో కొన్నిటిని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తారని తెలిపారు. 


ఈ ట్వీట్ వచ్చిన కొద్ది క్షణాలకే జనం స్పందించడం ప్రారంభించారు. కొందరు పెగాసస్, రఫేల్, పెట్రో ధరల పెరుగుదల, సాగు చట్టాలు వంటివాటి గురించి మాట్లాడాలని కోరారు. మరికొందరు కోవిడ్-19 వ్యాక్సినేషన్ గురించి మాట్లాడాలని కోరారు. 


Updated Date - 2021-07-30T18:46:27+05:30 IST