లక్నోలో కల్యాణ్ సింగ్‌‌కు ప్రధాని మోదీ నివాళులు

ABN , First Publish Date - 2021-08-22T18:36:02+05:30 IST

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్‌కు

లక్నోలో కల్యాణ్ సింగ్‌‌కు ప్రధాని మోదీ నివాళులు

లక్నో : ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నివాళులర్పించారు. కల్యాణ్ సింగ్ తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన పార్దివ దేహానికి అంత్యక్రియలు నరోరాలోని గంగా నది ఒడ్డున సోమవారం జరుగుతాయి. 


ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అడిషినల్ చీఫ్ సెక్రటరీ అవనీష్ ప్రకటించిన వివరాల ప్రకారం, కల్యాణ్ సింగ్ పార్దివ దేహాన్ని ప్రజల సందర్శన కోసం ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు విధాన సభ ప్రాంగణంలో ఉంచుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల వరకు బీజేపీ కార్యాలయంలో ఉంచుతారు. అనంతరం అలీగఢ్‌లోని స్టేడియంలో ఉంచుతారు. అక్కడి నుంచి నరోరాలోని గంగా నది ఒడ్డుకు తరలించి సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లక్నోలో ఆదివారం స్వాగతం పలికినవారిలో గవర్నర్ ఆనంది బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. కల్యాణ్ సింగ్ నివాసం వెలుపల మోదీ విలేకర్లతో మాట్లాడుతూ, సమర్థుడైన నాయకుడిని తాము కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన లేని లోటును భర్తీ చేయాలంటే, ఆయన విలువలు, నిర్ణయాలను అమలు చేయడానికి గరిష్ఠ స్థాయిలో కృషి చేయాలన్నారు. ఆయన కలలను నిజం చేయడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. ఆయనకు తన వద్ద స్థానం కల్పించాలని, ఈ బాధను తట్టుకోగలిగే శక్తిని ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని శ్రీరాముడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. 


మోదీ శనివారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో, కల్యాణ్ సింగ్‌లో భారతీయ విలువలు బలంగా ఉన్నాయన్నారు. మాటలతో వర్ణించలేనంత దుఃఖంతో తాను విచారిస్తున్నానని తెలిపారు. కల్యాణ్ సింగ్ గొప్ప వక్త, సీనియర్ పరిపాలకుడు, క్షేత్ర స్థాయిలో బలం ఉన్న నేత, గొప్ప మానవతావాది అని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్ అభివృద్ధిలో గొప్ప పాత్ర పోషించి, చెరగని ముద్ర వేశారన్నారు. ఆయన కుమారుడు రాజ్‌వీర్ సింగ్‌తో మాట్లాడి, వారి కుటుంబానికి సంతాపం తెలిపినట్లు పేర్కొన్నారు. 


ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, కల్యాణ్ సింగ్ ప్రజా శ్రేయస్సునే తన జీవిత మంత్రంగా చేసుకున్నారని తెలిపింది. దేశం, ఉత్తర ప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన కృషి చేశారని పేర్కొంది. నిజాయితీపరుడు, సుపరిపాలకుడు అనే పదాలకు పర్యాయపదంగా మారారని తెలిపింది.


కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం కల్యాణ్ సింగ్ మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశం, మతం, ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన కల్యాణ్ సింగ్‌‌కు శిరసు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. దేశం, బీజేపీ కుటుంబం ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాయన్నారు. ఆయన చేసిన విశేష కృషికి దేశం, రాబోయే తరాలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాయన్నారు. భగవంతుడు తన పాదాల చెంత కల్యాణ్ సింగ్‌కు స్థానం కల్పిస్తాడన్నారు.


Updated Date - 2021-08-22T18:36:02+05:30 IST