సాంస్కృతిక వికాసానికి వన్నెతెచ్చిన నాగళ్ల
ABN , First Publish Date - 2021-01-26T09:03:01+05:30 IST
తెలుగు సాహిత్యం, సాంస్కృతిక ఉన్నతికి ఒకే ప్రాంతం నుంచి వికాసం రావటం చిన్న విషయం కాదని..
ప్రజ్వలిత దుర్గాప్రసాద్ సంస్మరణ సభలో
ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్
తెనాలి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): తెలుగు సాహిత్యం, సాంస్కృతిక ఉన్నతికి ఒకే ప్రాంతం నుంచి వికాసం రావటం చిన్న విషయం కాదని, ఎందరో మహనీయులు సాహిత్యాభివృద్ధికి కృషి చేశారని, అటువంటి వారిలో ఒకరిగా కాకుండా గొప్ప మనీషిగా నాగళ్ల దుర్గాప్రసాద్కు ప్రత్యేక స్థానం ఉంటుందని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ అన్నారు. గుంటూరు జిల్లా కొల్లూరు మం డలం అనంతవరంలో ప్రజ్వలిత వ్యవస్థాపకుడు నాగళ్ల దుర్గాప్రసాద్ సంస్మరణ సభ సోమవారం జరిగింది. ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. తొలుత దు ర్గాప్రసాద్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం సభలో శ్రీనివాస్ మాట్లాడుతూ కళాకారుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి దుర్గాప్రసాద్ అని, అటువంటి అరుదైన వ్యక్తులు ఈ రంగానికి దూరం కావటం బాధాకరమన్నారు.
ఒకేప్రాంతం నుంచి వచ్చిన ఇంతటి సాహిత్య వికాసాన్ని కాలంతోపాటు జారవిడుచుకోకుండా, మరుగున పడిపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత ఉందన్నారు. నేటి ప్రపంచంలో అన్నీ మారిపోతున్నాయని, విలువలన్నీ దిగజారిపోతున్నాయని అనుకుంటున్నామని, పాత విలువలు లేకుండా పోవటం మంచిదికాదని, వాటి కొనసాగింపు కూడా ఉండాలన్నారు. అటువంటి వాటిని గుర్తుచేసే ఆలోచన, దానికోసం పరితపించే మనుషుల అవసరం మనకు ఉందని, అటువంటి వాటిని దుర్గాప్రసాద్ తీర్చారని, సాహిత్య లోకానికి అటువంటివారు అవసరమన్నారు.