మీ చాయ్ మీకు పంపాను.. మా ముద్ద మాకు పంపండి: సంజయ్

ABN , First Publish Date - 2020-09-22T18:22:24+05:30 IST

సస్పెండ్ అయిన ఎంపీలకు టీ తీసుకెళ్లిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్‌పై ట్విటర్ వేదికగా..

మీ చాయ్ మీకు పంపాను.. మా ముద్ద మాకు పంపండి: సంజయ్

న్యూఢిల్లీ: సస్పెండ్ అయిన ఎంపీలకు టీ తీసుకెళ్లిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్‌పై ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీకి ఆమాద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కౌంటరిచ్చారు. ఆ చాయ్‌ని గౌరవంగా వెనక్కి పంపిస్తున్నాననీ.. అంతే గౌరవంతో వ్యవసాయ బిల్లులను వెనక్కి పంపాలని ఆయన కోరారు. ‘‘మోదీజీ, మేము చాయ్ కోసం పోరాడడం లేదు. మీరు లాగేసుకున్న మా రైతుల సంక్షేమం కోసం పోరాడుతున్నాం. చేతులు జోడించి నేను విన్నవిస్తున్నది ఏమంటే- నేను గౌరవంగా మీ చాయ్ మీకు పంపుతున్నాను. అంతే గౌరవంగా మా రైతుల ముద్ద కూడా తిరిగి ఇచ్చేయండి....’’ అని సంజయ్ పేర్కొన్నారు.


కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వ్యవసాయ రంగ బిల్లులను ఓటింగ్ లేకుండా రాజ్యసభలో నెగ్గించుకోవడంపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిప్యూటీ చైర్మన్‌ పట్ల ‘‘అనుచితంగా’’ వ్యవహరించారంటూ సంజయ్ సింగ్ సహా ఎనిమిది మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో నిన్న పార్లమెంట్ ఆవరణంలో ధర్నా చేపట్టిన బహిష్కృత ఎంపీలు రాత్రంతా మహాత్మా గాంధీ విగ్రహం వద్దే గడిపారు. ఉదయాన్నే డిప్యూటీ చైర్మన్ హరివంశ్ స్వయంగా వారికి టీ, స్నాక్స్ తీసుకెళ్లినా వారు ధర్నా విరమించేందుకు అంగీకరించలేదు. అయితే సస్పెన్షన్‌కు నిరసనగా విపక్షాలన్నీ నేటి నుంచి రాజ్యసభను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించడంతో ఎంపీలు తమ ధర్నా విరమించుకున్నారు.



Updated Date - 2020-09-22T18:22:24+05:30 IST