Please.. బతకాలని ఉంది.. నన్ను బతికించండి..!
ABN , First Publish Date - 2021-12-26T18:50:13+05:30 IST
చదవాలని ఉంది... నన్ను బతికించండి అంటూ ఓ బీటెక్ విద్యార్థిని వేడుకుంటోంది...
- సాయం కోసం బీటెక్ విద్యార్థిని వేడుకోలు
- పుట్టుకతోనే ఓ కిడ్నీ లేదన్న వైద్యులు
- ఉన్న కిడ్నీ మార్పిడికి రూ.20 లక్షలు కావాలి
చిత్తూరు జిల్లా/మదనపల్లె : చదవాలని ఉంది... నన్ను బతికించండి అంటూ ఓ బీటెక్ విద్యార్థిని వేడుకుంటోంది. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తమ బిడ్డ శస్త్రచికిత్సకు దాతలు సాయం చేయాలని తల్లిదండ్రులు అర్థిస్తున్నారు. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం కోనపేటకు చెందిన ఆర్.చంద్రమోహన్, దేవి దంపతులు రైతులు. వీరికి ఒక్కగానొక కుమార్తె ఆర్.హిమజ(18). మూడేళ్ల కిందట ఉపాధి నిమిత్తం మదనపల్లెకు వలసొచ్చారు. పట్టణ శివార్లలోని శ్రీవారినగర్లో స్థిరనివాసం ఏర్పరచుకుని నీరుగట్టువారిపల్లెలోని టమోటా మార్కెట్ యార్డులో కూలి పనులకు వెళుతున్నారు. ఈక్రమంలో హిమజ కడపలోని కందుల ఓబుల్రెడ్డి మెమోరియల్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
కాగా.. విద్యార్థిని రెండునెలల కిందట తీవ్ర అస్వస్థతకు గురై కిందపడిపోవడంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి పుట్టుకతోనే ఓ కిడ్నీ లేదని, ఉన్న మూత్రపిండం పనిచేయడం లేదని చెప్పారు. కిడ్నీ మార్పిడి చేయాలని, లేకుంటే ప్రమాదమని తెలిపారు. అంతవరకు డయాలసిస్ చేసుకోవాలని సూచించారు. మొత్తమ్మీద రూ.20 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. కూలిపనులతో జీవనం సాగించే దంపతులు రూ.3 లక్షల వరకు అప్పు చేసి కుమార్తెకు చికిత్స చేయించారు. ప్రస్తుతం మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో డయాలసిస్ చేయిస్తున్నారు.
కాగా.. శనివారం డయాలసిస్ కేంద్రానికి వచ్చిన హిమజ, ఆమె తల్లి దేవి తమ బాధను మీడియాకు చెప్పుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ఒక్కగానొక కుమార్తె వైద్యం కోసం సంపాదనంతా ఖర్చు చేస్తున్నామని, దాతలు ముందుకొచ్చి ఆర్థిక సాయం చేయాలని వేడుకుంది. సాయం చేయాలనుకునే దాతలు ఫోన్ నెంబర్లు 9502058163, 8143832360లో సంప్రదించాలని కోరారు. లేకుంటే ఎస్బీఐ అకౌంట్ నెం.35877578698కు ఆర్థిక సాయం జమ చేయాలని కోరారు.