Please.. ప్రతి స్కూల్కూ వెళ్లండి : మేయర్ విజయలక్ష్మి
ABN , First Publish Date - 2021-08-27T16:42:58+05:30 IST
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పారిశుధ్య నిర్వహణకు జీహెచ్ఎంసీ...
హైదరాబాద్ సిటీ : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పారిశుధ్య నిర్వహణకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో క్లీనింగ్ ప్రక్రియ ప్రారంభించింది. లాక్డౌన్తో ఏడాదిన్నరగా పాఠశాలలు మూసి వేసి ఉన్నాయి. దీంతో అపరిశుభ్రంగా మారిన గ్రేటర్ పరిధిలోని స్కూళ్లను శుభ్రపర్చే బాధ్యతను ప్రభుత్వం జీహెచ్ఎంసీకి అప్పగించింది. జిల్లా పరిధిలో 690, రంగారెడ్డిలో 167, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 276తో కలిపి సంస్థ సిబ్బంది మొత్తం 1133 పాఠశాలలు, కళాశాలల్లో పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. గురువారం అంబర్పేట, ముషీరాబాద్ నియోజకవర్గాల్లోని పాఠశాలలను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిశీలించారు. చెత్తా చెదారం పేరుకుపోవడాన్ని గమనించిన ఆమె పూర్తిగా తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లాలని సూచించారు. 30వ తేదీ వరకు పారిశుధ్య నిర్వహణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
శానిటైజేషన్ చేయించండి..!
‘ప్లీజ్ ప్రతి స్కూల్కు వెళ్లండి. తరగతి గదులలో శానిటైజేషన్ చేయించండి’ అని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కార్పొరేటర్లకు సూచించారు. ముషీరాబాద్ డివిజన్లోని కళాధర్నగర్లో గురువారం వంద శాతం వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తయింది. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు ఎమ్మెల్యే ముఠాగోపాల్, కార్పొరేటర్ పాల్గొన్నారు.