కాపాడండి.. దూబే ఎన్‌కౌంటర్‌కి కొద్ది గంటల ముందు సుప్రీంకోర్టులో పిటిషన్..

ABN , First Publish Date - 2020-07-10T19:16:18+05:30 IST

ఉత్తర ప్రదేశ్ మోస్ట్ వాంటెడ్ నేరగాడు వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌లో మరణించే కొద్ది గంటల ముందు...

కాపాడండి.. దూబే ఎన్‌కౌంటర్‌కి కొద్ది గంటల ముందు సుప్రీంకోర్టులో పిటిషన్..

న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ మోస్ట్ వాంటెడ్ నేరగాడు వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌లో మరణించే కొద్ది గంటల ముందు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఐదుగురు దూబే అనుచరుల ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్టేలా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలనీ.. దూబేకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని కోరుతూ ఘన్‌శ్యాం ఉపాధ్యాయ్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. గతవారం రోజులుగా ఉత్తర ప్రదేశ్ పోలీసులు చేసినవన్నీ ‘‘బూటకపు’’ ఎన్‌కౌంటర్లుగా అనుమానాలు ఉన్నందున తన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ కోరారు. ‘‘వికాస్ దూబేకి ప్రాణహాని జరక్కుండా యూపీ ప్రభుత్వం, పోలీసులు పూర్తిస్థాయి భద్రత కల్పించాలి. కోర్టులో ప్రవేశపెడుతున్న సందర్భంగా ఎప్పటికప్పుడు పోలీసుల చేతుల్లో అతడు మరణించకుండా రక్షణ కల్పించాలి...’’ అని పిటిషనర్ కోరారు. దూబే కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించాలని సుప్రీంకోర్టుకు విన్నవించారు. 


‘‘ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఒక్కసారి వికాస్ దూబేను అదుపులోకి తీసుకుంటే ఇతర సహనిందితులను కాల్చిచంపినట్టే దూబేను కూడా హతమార్చే అవకాశం ఉంది. ఎన్‌కౌంటర్ పేరుతో పోలీసులు ఓ నిందితుడిని చంపడం మరింత తీవ్రమైన నేరం అవుతుంది. ఇది చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. అదే జరిగితే దేశం తాలిబన్ల పద్ధతిలోకి వెళ్లినట్టే కాబట్టి నా పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టండి..’’ అని ధర్మాసనాన్ని పిటిషనర్ అభ్యర్థించారు. చట్ట ప్రకారం న్యాయ ప్రక్రియ ద్వారా నేరం రుజువు కాకకుండా.. పోలీసులు ఎన్‌కౌంటర్ పేరుతో అతడిని చంపి న్యాయవ్యవస్థ అధికారాల్లో జోక్యం చేసుకోలేరని ఆయన విన్నవించారు. యూపీ పోలీసులు తమంత తాముగా దూబే నివాస భవనాన్ని కూల్చివేసి, అతడి విలువైన వస్తువులు, కార్లను తరలించి, చరస్థిరాస్తులను ధ్వంసం చేయడం ‘‘పూర్తిగా చట్ట విరుద్ధమని’’ పిటిషనర్ ఆరోపించారు. 

Updated Date - 2020-07-10T19:16:18+05:30 IST