8 నెలల తర్వాత క్రీడా కేంద్రాలు
ABN , First Publish Date - 2020-11-25T06:17:16+05:30 IST
కొవిడ్-19 నేపథ్యంలో 8 నెలల కింద మూత పడిన క్రీడా కేంద్రాలు బుధవారం తెరుచుకోనున్నట్లు జిల్లా క్రీడాశాఖ సెట్కూరు సీఈవో నాగరాజనాయుడు తెలిపారు.
కర్నూలు(స్పోర్ట్స్), నవంబరు 24: కొవిడ్-19 నేపథ్యంలో 8 నెలల కింద మూత పడిన క్రీడా కేంద్రాలు బుధవారం తెరుచుకోనున్నట్లు జిల్లా క్రీడాశాఖ సెట్కూరు సీఈవో నాగరాజనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని డీఎ్సఏ స్టేడియంలో మంగళవారం ప్రధాన శిక్షకులు నటరాజరావు, జిల్లా క్రీడాధికార అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెట్కూరు సీఈవో నాగరాజనాయుడు, నటరాజరావు మాట్లాడుతూ రాష్ట్ర క్రీడాశాఖ ఆదేశాల మేరకు స్టాండర్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ను అనుసరించి నేటి నుంచి జిల్లా క్రీడాకారుల సౌలభ్యం కోసం శిక్షణను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాశాఖ సంయుక్తంగా ఇచ్చిన గైడెన్స్ అనుసరించి క్రీడా మైదానాలను క్రీడాకారుల సాధనకు అనువుగా సిద్ధం చేశామని తెలిపారు. ఎస్ఓపీలో భాగంగా మొదట ఆర్చరీ, ఫెన్సింగ్, స్విమ్మింగ్, బాక్సింగ్, సైక్లింగ్, అథ్లెటిక్స్ లాంటి తదితర క్రీడాంశాల్లో పాల్గొనే క్రీడాకారులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు వివరించారు. కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా సాధనకు వచ్చిన క్రీడాకారులకు శిక్షణ ఇవ్వాలని ఆయన శిక్షకులకు సూచించారు.