సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రణాళిక

ABN , First Publish Date - 2022-05-19T04:52:22+05:30 IST

సైబర్‌ నేరాలు రోజురోజుకు పెరుగు తున్నందున వాటిని నియంత్రించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు.

సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రణాళిక
వీసీలో పాల్గొన్న ఎస్పీ, అధికారులు

- డీజీపీ మహేందర్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, మే 18 : సైబర్‌ నేరాలు రోజురోజుకు పెరుగు తున్నందున వాటిని నియంత్రించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ పోలీస్‌ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. టెక్నికల్‌ విభాగాన్ని బలోపేతం చేసేందుకు వివిధ శాఖలు, ఆయా రంగాలలో ఉన్న నిపుణుల సహాయాన్ని తీసుకుంటూ ప్రజలను యువతను చైతన్యం చేసేందుకు ప్రణాళిక రూపొందించి సైబర్‌ నేరాలను అరికట్టేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. దేశంలో వేర్వేరు ప్రాంతాలకు చెందిన సైబర్‌ నేరగాళ్లు అమాయకులైన ప్రజలను సులువుగా మోసం చేయగలుగుతున్నారని విచారం వెలిబుచ్చారు. పెరిగిన టెక్నాలజీని ఉపయోగించుకుని నేరాలకు పాల్పడుతున్నందున వాటిని కట్టడి చేసేందుకు పోలీసులు సమాయత్తం కావాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సైబర్‌ నేరాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. పోలీసు కళాజాత బృందాల ద్వారా అవగాహన కల్పించడం,  పోస్టర్లు, కరపత్రాలద్వారా ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. సైబర్‌ నేరాలకు పాల్పడిన వారు వెంటనే డయల్‌ 1930 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని ప్రజలకు సమాచారం ఇస్తున్నామన్నారు.  ఈ కార్యక్రమంలో అడిషినల్‌ ఎస్పీ రాములు, డీఎస్పీలు మహేశ్‌, వెంకటరమణారెడ్డి, అధికారులు, టెక్నికల్‌ బృందాలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-19T04:52:22+05:30 IST