ఆ దేవాలయ భూ రికార్డులు కోర్టు ముందు ఉంచండి
ABN , First Publish Date - 2022-09-23T10:55:54+05:30 IST
ఆ దేవాలయ భూ రికార్డులు కోర్టు ముందు ఉంచండి
ఇఫ్కోకు భూ కేటాయింపుల కేసులో అధికారులకు హైకోర్టు ఆదేశం
అమరావతి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా, కొవ్వూరు మండలం, కొత్తూరు పరిధిలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయం భూములకు సంబంధించిన రికార్డులను న్యాయస్థానం ముందు ఉంచాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అడ్వకేట్ జనరల్ (ఏజీ)ని ఆదేశించింది. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎ్సఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. యూరియా ప్లాంట్ ఏర్పాటు కోసం నెల్లూరు జిల్లా, కొత్తూరు గ్రామ పరిధిలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయానికి చెందిన 1,009 ఎకరాలతో పాటు కడవలూరు మండల పరిధిలోని బొడ్డవారిపాలెం, రేగడిచెలిక, రాచర్లపాడు, తలమంచి గ్రామాల రైతులకు చెందిన పట్టా భూములు కలిపి మొత్తం 2,776 ఎకరాలను ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో)కు ఇచ్చారు. అయితే.. యూరియా, అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటులో ఎలాంటి పురోగతీ లేదని, భూ కేటాయింపల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని పేర్కొంటూ కొడవలూరు మండలం అప్పటి జడ్పీటీసీ సభ్యుడు ఇ. శ్రీధర్రెడ్డితో పాటు మరో ముగ్గురు 2017లో హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని అభ్యర్థించారు. గురువారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్ రవిచంద్ర వాదనలు వినిపించారు. ఆ వివరాలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం వ్యాజ్యంపై విచారణను కొనసాగించేందుకు దేవాలయం భూముల రికార్డులను పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఆ భూముల పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని అధికారులను ఆదేశించింది.