టీఆర్‌ఎస్‌కు పీకే, కాంగ్రెస్‌కు ఎస్కే!.. తెలంగాణలో వ్యూహకర్తల హవా

ABN , First Publish Date - 2022-03-01T00:04:10+05:30 IST

వ్యూహకర్తల సందడితో తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. ముందుస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పార్టీలన్నీ బిజీ అయ్యాయి.

టీఆర్‌ఎస్‌కు పీకే, కాంగ్రెస్‌కు ఎస్కే!.. తెలంగాణలో వ్యూహకర్తల హవా

హైదరాబాద్: వ్యూహకర్తల సందడితో తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. ముందుస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పార్టీలన్నీ బిజీ అయ్యాయి. పార్టీల వ్యూహ, ప్రతి వ్యూహాలను వ్యూహకర్తలే నిర్ణయించబోతున్నారు. ‘బీజేపీ ముక్త్‌ భారత్‌’ అంటూ నినదించిన సీఎం కేసీఆర్‌ జాతీయ స్థాయిలో వేదిక ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ప్రధాని మోదీ వ్యతిరేక కూటమి కట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బీజేపీ, కాంగ్రేసేతర పార్టీలతో జత కట్టేందుకు దేశాన్ని చుట్టేయాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో రాజకీయవాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు వ్యూహకర్తగా ప్రశాంత్‌కిషోర్ రంగంలోకి దిగారు. 


ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ఎవరు ప్రత్యామ్నాయం అనే చర్చ సాగుతోంది. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ, టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్నాయి. బీజేపీ నేతలు తమకు వ్యూహకర్తల అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. ఇప్పటికే ఆ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించింది. 40 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకోవాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. సభ్యత్వ నమోదుతో పాటు వ్యూహకర్తల వ్యూహాలు ఉంటే బాగుంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. ఇందులోభాగంగా ప్రశాంత్ కిషోర్ అనుచరుడైన సునీల్ కనుగోలు (ఎస్కే) సేవలను ఉయోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. సునీల్‌కు ఏపీతో అనుబంధం ఉంది. ఆయన విజయవాడలో జన్మించారు. ప్రస్తుతం సునీల్ కుటుంబం చెన్నైలో స్థిరపడింది. ఇప్పటికే సునీల్ అనేక పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఆయనకు నేతలను విజయతీరాలకు చేర్చిన చరిత్ర కూడా ఉందని చెబుతున్నారు. అందువల్ల ఎస్కేను కాంగ్రెస్ వ్యూహకర్తగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 


కాంగ్రెస్, టీఆర్ఎస్ మాదిరిగా వ్యూహకర్తల మీదగా ఆధారపడకుండా తన కార్యకర్తలనే బీజేపీ నమ్ముకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణలో జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు పర్యటిస్తారని చెబుతున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభా నియోజకవర్గాల వారీగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఆ పార్టీ నేత బండి సంజయ్ రెండోవిడత పాదయాత్రతో పాటు సభలు సమావేశాలకు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కేసీఆర్ ఎన్నికలకు వెళ్తాడని బీజేపీ అంచనా వేస్తోంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారమే లక్ష్యంగా కమలనాథులు బరిలోకి దిగుతున్నారు.

Updated Date - 2022-03-01T00:04:10+05:30 IST