కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు మాతృవియోగం
ABN , First Publish Date - 2020-06-06T18:53:46+05:30 IST
బీజేపీ సీనియర్ నాయకురాలు, రైల్వేమంత్రి పీయూష్ గోయల్ తల్లి చంద్రకాంత గోయల్ కన్నుమూశారు.
ముంబై: బీజేపీ సీనియర్ నాయకురాలు, రైల్వేమంత్రి పీయూష్ గోయల్ తల్లి చంద్రకాంత గోయల్ కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య కారణాలతో ఆమె చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మాతుంగ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ముంబై మహానగర కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్గా కూడా గెలుపొందారు. మహారాష్ట్రలో బీజేపీ అభివృద్ధిలో కీలక పాత్రపోషించారు. ఆమె అంత్యక్రియలు ఇవాళ జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
పీయూష్ గోయల్ తన తల్లి మరణవార్తను ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆమె తన యావత్ జీవితాన్నిప్రజాసేవకే అంకితం చేశారని ఆయన పేర్కొన్నారు. చంద్రకాంత భర్త, పీయూష్ తండ్రి వేద్ ప్రకాశ్ గోయల్ కూడా బీజేపీలో సీనియర్ నాయకులు. వాజ్పేయి ప్రభుత్వంలో నౌకాయానశాఖ మంత్రిగా సేవలు అందించారు.