Mango Festival : బెల్జియంలో మన మామిడి వేడుక
ABN , First Publish Date - 2022-06-18T18:59:30+05:30 IST
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) శుక్రవారం మామిడి
బ్రసెల్స్ : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) శుక్రవారం మామిడి పండ్ల ఉత్సవాలను (Mango Festival) ప్రారంభించారు. భారతీయ మామిడి పండ్ల గురించి యూరోపియన్లకు అవగాహన కల్పించడానికి, భారతీయ మామిడి పండ్లకు యూరోపులో మార్కెట్ను సృష్టించడానికి ఈ ఉత్సవాలు దోహదపడతాయన్నారు.
బెల్జియం, లగ్జెంబెర్గ్, యూరోపియన్ యూనియన్లకు భారత రాయబారి సంతోష్ ఝా మాట్లాడుతూ, భారతీయ మామిడి పండ్లకు యూరోపులో విపరీతమైన ఆకర్షణ ఉందని చెప్పారు. బెల్జియంలో ఈ ఉత్సవాలను నిర్వహించడం ఇదే మొదటిసారి అని తెలిపారు. యూరోపియన్ యూనియన్లోని అన్ని ఆర్గనైజేషన్లు ఇక్కడికి వచ్చాయని, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా రావడం అదృష్టమని తెలిపారు.
భారత రాయబార కార్యాలయంలోని వ్యవసాయ, సముద్ర ఉత్పత్తుల శాఖ సలహాదారు డాక్టర్ స్మిత సిరోహి మాట్లాడుతూ, మామిడి పండ్ల ఉత్సవాలను నిర్వహించడం వెనుక ఉద్దేశాన్ని వివరించారు. భారతీయ మామిడి పండ్లను యూరోపియన్ (European Union) మార్కెట్లలో ప్రదర్శించి, వాటిపట్ల బెల్జియం వినియోగదారులకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత దేశం అందిస్తున్న రకరకాల మామిడి పండ్ల గురించి తెలియజేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.
బంగినపల్లి కూడా
ఈ మామిడి పండ్ల ఉత్సవాల్లో ఏడు రకాల మామిడి పండ్లను ప్రదర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి బంగినపల్లి, ఉత్తర ప్రదేశ్ నుంచి మలిహాబాద్ దశేరీ, ఒడిశా నుంచి అమ్రపాలి, హిమసాగర్. లక్ష్మణ్ భోగ్, జర్దాలు, లంగ్రా మామిడి పండ్లను ప్రదర్శించారు.