అభివృద్ధి పనులు చేపట్టరా?

ABN , First Publish Date - 2022-01-29T05:36:11+05:30 IST

పిఠాపురం, జనవరి 28: పాలకవర్గం ఏర్పడి 8నెలలు అయిందని, ఇప్పటి వరకూ అభివృద్ధి పనులు ఎందుకు చేపట్టడంలేదని వైసీపీ కౌన్సిలర్లు ప్రశ్ని ంచారు. చిన్న చిన్న పనులు కూడా జరగడం లేదన్నారు. పిఠాపురం పురపాలక సంఘ కార్యాలయంలో శుక్రవారం చైర్‌పర్సన్‌ గండేపల్లి

అభివృద్ధి పనులు చేపట్టరా?

పిఠాపురం మున్సిపల్‌ బడ్జెట్‌ సమావేశంలో ప్రశ్నించిన వైసీపీ కౌన్సిలర్లు 

పిఠాపురం, జనవరి 28: పాలకవర్గం ఏర్పడి 8నెలలు అయిందని, ఇప్పటి వరకూ అభివృద్ధి పనులు ఎందుకు చేపట్టడంలేదని వైసీపీ కౌన్సిలర్లు ప్రశ్ని ంచారు. చిన్న చిన్న పనులు కూడా జరగడం లేదన్నారు. పిఠాపురం పురపాలక సంఘ కార్యాలయంలో శుక్రవారం చైర్‌పర్సన్‌ గండేపల్లి సూర్యావతి అధ్యక్షతన మున్సిపల్‌ బడ్జెట్‌ సమావేశం జరిగింది. సభ్యులు సమస్యలు ఏకరువు పెట్టారు. నిధులు అందుబాటులో ఉన్నా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకే పనులు చేయడం లేదన్నారు. అత్యవసర పనులను సాధారణ నిధుల నుంచి చేపట్టాలని డిమాండ్‌ చేశారు. తాము పదవులు చేపట్టి ఎనిమిది నెలలు గడిచినా ఇప్పటి వరకూ గౌరవ వేతనాలు అందలేదని కౌన్సిలర్లు తలిశెట్టి వెంకటేశ్వరరావు, పెదపాటి నాగేశ్వరరావు తెలిపారు. మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమన్నారు. వన్‌వే ట్రాఫిక్‌రోడ్డులో వీధి దీపాలు వెలగడం లేదని బోను దేవా చెప్పారు. మాధవస్వామి గుడివీధి, గొల్లపేట తదితర ప్రాంతాల్లో కుక్కల బెడద అధికంగా ఉందని, రాత్రివేళల్లో ప్రజలు రోడ్డుపై తిరగలేకపోతున్నారని మరో కౌన్సిలర్‌ పంపనబోయిన అన్నపూర్ణ తెలిపారు. బడ్జెట్‌లో లెక్కలు ఇష్టారీతిన ఉన్నాయని బొజ్జా జగదీశ్వరి విమర్శించారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు సొంత నిధులతో నిర్మించిన బస్‌షెల్టర్‌ను తక్షణం వినియోగంలోకి తీసుకురావాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా డివైడర్లు తొలగించాలని కోరారు. 


అధికారులు విఫలం

పట్టణంలో అక్రమ కట్టడాలు పెరిగిపోతున్నా టౌన్‌ప్లానింగ్‌ అధికారులు నియంత్రించడంలో విఫలమయ్యారని కౌన్సిలర్లు బొజ్జా జగదీశ్వరి, అల్లవరపు నగేష్‌, పంపనబోయిన అన్నపూర్ణ, కోళ్ల బంగారుబాబు, రాయుడు శ్రీనివాసరావు ఆరోపించారు. కాకినాడ జిల్లాకు పిఠాపురం మహారాజా పేరు పెట్టాలని బొజ్జా జగదీశ్వరీదేవి కోరారు. ఈ మేరకు కౌన్సిల్‌లో తీర్మానం చేద్దామని ప్రతిపాదించారు. పిఠాపురం, కాకినాడలో పలు విద్యాసంస్థలు స్థాపించడంతో పాటు వందల ఎకరాల భూములను ప్రజావసరాలకు దానంగా ఇచ్చారని తెలిపారు. అంతకుముందు పురపాలకసంఘానికి సంబంధించి 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.1.22 కోట్లు మిగులుతో రూపొందించిన బడ్జెట్‌ను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. అన్నిమార్గాల ద్వారా రూ.30.16కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేయగా, రూ.28.96కోట్లు వ్యయం అవుతుందని అంచనాల్లో చూపారు. మున్సిపల్‌ కమిషనరు రామ్మోహన్‌, వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T05:36:11+05:30 IST