‘స్మృతీ ఇరానీ సహాయం’ కేవలం ప్రచారమే : పినరయ్ విజయన్

ABN , First Publish Date - 2020-04-09T19:21:55+05:30 IST

రాహుల్ గాంధీ నియోజకవర్గం వయనాడ్‌లో చిక్కుకున్న కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ నియోజకవర్గమైన అమేథీ వలస కూలీలకు స్మృతీ ఇరానీ

‘స్మృతీ ఇరానీ సహాయం’ కేవలం ప్రచారమే : పినరయ్ విజయన్

తిరువనంతపురం : రాహుల్ గాంధీ నియోజకవర్గం వయనాడ్‌లో చిక్కుకున్న కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ నియోజకవర్గమైన అమేథీ వలస కూలీలకు స్మృతీ ఇరానీ సహాయపడుతోందన్న వార్తలు కేవలం ప్రచారం మాత్రమేనని కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ కొట్టి పారేశారు. ‘‘రాహుల్ గాంధీ నియోజకవర్గమైన వయనాడ్‌లో అమేథీకి చెందిన వలస కూలీలు చిక్కుకున్నారు. వారికి స్మృతీ ఇరానీ తగిన సహాయం చేస్తున్నారు’’ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధికారిక పత్రిక ‘ఆర్గనైజర్’ సోమవారం పేర్కొంది.


స్మృతి సకాలంలో జోక్యం చేసుకోవడం వల్ల వయనాడ్‌లో భాగమైన మలప్పురంలో చిక్కుకున్న కార్మికులను రక్షించారని ఆ పత్రిక పేర్కొంది. ఈ వ్యవహారంపై కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ స్పందించారు. వలస కూలీలందరూ చాలా బాగున్నారని పేర్కొన్నారు. ‘‘కేంద్ర మంత్రి సకాలంలో జోక్యం చేసుకొని అమేథీ వలస కూలీలకు సహాయపడ్డారని వార్తలు విన్నాం. ఒక్కటి మాత్రం స్పష్టం చేయదలుచుకున్నా. రాష్ట్రంలోని కూలీలతో పాటు ఇతర రాష్ట్రాల వలస కూలీలకు కూడా మా రాష్ట్రం సహాయం చేస్తోంది. అదంతా కేవలం ప్రచారం మాత్రమే’’ అని స్పష్టం చేశారు.


41 మంది వలస కూలీలు కలిసి మెలిసి ఉంటున్నారని, ఆహారానికి అవసరమైన 25 కిట్లను కూడా పంపిణీ చేశామని తెలిపారు. వారందరూ సొంతంగా వంటలు కూడా చేసుకుంటున్నారని, వారెవ్వరికీ కూడా ఆహార పదార్థాల కొరత లేదని సీఎం పినరయ్ స్పష్టం చేశారు. 

Updated Date - 2020-04-09T19:21:55+05:30 IST