హర హర మహదేవ్ అంటూ Amarnath yatra ప్రారంభం

ABN , First Publish Date - 2022-06-29T12:39:48+05:30 IST

హర హర మహదేవ్ అంటూ పవిత్ర అమరనాథ్ యాత్ర బుధవారం ప్రారంభమైంది...

హర హర మహదేవ్ అంటూ Amarnath yatra ప్రారంభం

జమ్మూ(జమ్మూకశ్మీర్): హర హర మహదేవ్ అంటూ పవిత్ర అమరనాథ్ యాత్ర బుధవారం ప్రారంభమైంది.రెండేళ్ల విరామం తర్వాత బుధవారం అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కావడంతో యాత్రికులు ‘బమ్ బమ్ భోలే’  ‘హర్ హర్ మహాదేవ్’ కీర్తనల మధ్య శ్రీ అమర్‌నాథ్‌ యాత్రికుల మొదటి బ్యాచ్ జమ్మూ నుంచి కశ్మీర్ లోయకు బయలుదేరింది. అమర్‌నాథ్ యాత్రికుల మొదటి బ్యాచ్‌ను జమ్మూలోని యాత్రి నివాస్ భవన్ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. బుధవారం తెల్లవారుజామున 3వేల మందికి పైగా యాత్రికులు కశ్మీర్ లోయకు బయలుదేరారు. కొవిడ్ మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాలుగా యాత్ర నిర్వహించడం సాధ్యం కాలేదు.


బైక్ స్క్వాడ్ కమాండోల ఎస్కార్ట్

ఈ సంవత్సరం రికార్డు సంఖ్యలో యాత్రికులు వస్తారని జమ్మూకశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ అంచనా వేసింది.ఈ యాత్రకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉండడంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యాత్రికులకు సీఆర్‌పిఎఫ్‌కు చెందిన బైక్ స్క్వాడ్ కమాండోలు ఎస్కార్ట్ చేస్తున్నారు. భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వద్ద గట్టి నిఘాను ఏర్పాటు చేశారు.ఈ యాత్రకు ముందే లష్కరే తోయిబా ఉగ్రవాదులు బెదిరించారు.బెదిరించిన వారిపై కేసులు నమోదు చేశామని, కొందరిని అరెస్ట్‌ చేశామని జమ్మూ జోన్ ఏడీజీపీ ముఖేష్ సింగ్ తెలిపారు.యాత్రికులు ప్రయాణించే వాహనాలకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్‌లు జోడించారు.ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రను సురక్షితంగా, సాఫీగా నిర్వహించేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 


హిమాలయాలపై బీఎస్ఎఫ్ దళాల పహరా

హిమాలయాలపై బీఎస్ఎఫ్ దళాల పహరా ఏర్పాటు చేశారు. కొవిడ్-19 కారణంగా రెండేళ్ల విరామం తర్వాత 43 రోజుల వార్షిక తీర్థయాత్ర జరగనున్నందున ఈ సంవత్సరం యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా.పహల్గామ్, బల్తాల్ మార్గం నుంచి అమర్‌నాథ్ గుహకు దారితీసే పర్వతాలు, కొండ శిఖరాల్లో సరిహద్దు భద్రతా దళాలను మోహరించారు. పవిత్ర గుహను సందర్శించే భక్తుల భద్రత కోసం వివిధ ప్రదేశాలలో భారత సైన్యం తాత్కాలిక పోస్ట్‌లను కూడా ఏర్పాటు చేసింది.అమర్‌నాథ్ భక్తులకు కర్రలు, ఉన్ని టోపీలు, స్వెటర్లు, ప్లాస్టిక్ బూట్లను ముస్లింలు అందజేశారు. 


శ్రీనగర్ నుంచి హెలికాప్టర్ సేవలు

ఈ సంవత్సరం మొదటిసారి భక్తులు హెలికాప్టర్ ద్వారా శ్రీనగర్ నుంచి నేరుగా పంజతర్ని చేరుకోవచ్చు. పంజ్‌తర్ని నుంచి ఆరు కిలోమీటర్ల పాదయాత్రతో పవిత్ర అమర్‌నాథ్ గుహకు భక్తులను తీసుకువెళతారు. ఇంతకు ముందు బల్తాల్ నుంచి పంజ్‌తర్ని వరకు మాత్రమే హెలీ సర్వీస్ అందుబాటులో ఉండేది. సుదీర్ఘ ప్రయాణాన్ని నివారించాలనుకునే యాత్రికులు శ్రీనగర్ నుంచి నేరుగా హెలికాప్టర్‌లో ప్రయాణించవచ్చు. ఇది ప్రయాణ సమయాన్ని కూడా తగ్గిస్తుంది.రక్షా బంధన్ రోజున ఆగస్టు 11వతేదీన అమర్‌నాథ్ యాత్ర ముగియనుంది.

Updated Date - 2022-06-29T12:39:48+05:30 IST