చెరువు ఆక్రమణపై హైకోర్టులో పిల్
ABN , First Publish Date - 2022-07-07T06:10:30+05:30 IST
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సుబేదార్ కుంట చెరువును ఆక్రమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది
ప్రతివాదులకు నోటీసులు జారీ
అమరావతి, జూలై 6(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సుబేదార్ కుంట చెరువును ఆక్రమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, అనంతపురం కలెక్టర్, కళ్యాణదుర్గం ఆర్డీవో, తహసీల్దార్కు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణల విషయంలో సుమోటోగా నమోదు చేసిన పిల్తో ప్రస్తుత వ్యాజ్యాన్ని జతచేయాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎ్సఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. కళ్యాణదుర్గంలోని సుబేదార్కుంట ఆక్రమణను అడ్డుకోవాలని కోరుతూ టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ఎం.ఉమామహేశ్వరనాయుడు హైకోర్టులో పిల్ వేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది వై.బాలాజీ వాదనలు వినిపించారు. చెరువును పూడ్చి, ప్లాట్లుగా వేసి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. వైసీపీకి చెందిన ఓ మంత్రి, అనుచరుల ప్రోద్బలంతో కబ్జా ప్రక్రియ సాగుతోందని వివరించారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, కౌంటర్ వేయాలని ప్రతివాదులను ఆదేశించింది.