దొడ్డిదారిన.. పెట్రోకోక్
ABN , First Publish Date - 2020-08-09T12:39:50+05:30 IST
పిడుగురాళ్లలో సున్నం పరిశ్రమకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకప్పుడు..
గుట్టుచప్పుడు కాకుండా పిడుగురాళ్లకు..
రూ.లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి
పిడుగురాళ్ల(గుంటూరు): పిడుగురాళ్లలో సున్నం పరిశ్రమకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకప్పుడు ఇక్కడ 200లకుపైగా సున్నం బట్టీలు ఉండగా ప్రభుత్వం నుంచి రాయితీలు అందక కొన్ని, ఆర్థిక నష్టాలతో మరికొన్ని మూతపడ్డాయి. ప్రస్తుతం సుమారుగా 100లోపు బట్టీలు మాత్రమే నడుస్తున్నాయి. బట్టీల్లో ముడిరాయిని కాల్చేందుకు బొగ్గును కొందరు అక్రమమార్గంలో తీసుకొచ్చి జేబులు నింపుకొంటున్నారు. విజయవాడ, విశాఖపట్నం, మరికొన్ని ప్రాంతాల్లో తయారయ్యే బొగ్గుతోపాటు ఝరియా బొగ్గును కూడా సున్నం వ్యాపారులు వాడుతుంటారు. ఒక టన్ను ఝరియా బొగ్గుతో 8 టన్నుల రాయిని కాల్చే అవకాశముంది. దీంతో కొందరు వ్యాపారులు కొత్తదారి కనుకున్నారు.
చెన్నై నుంచి వచ్చే పెట్రోకోక్ను పిడుగురాళ్లకు దారిమళ్లిస్తున్నారు. వాస్తవానికి పెట్రోకోక్(పెట్రోలియం ఉత్పత్తుల వ్యర్థం)ను పవర్ప్లాంటు, సిమెంట్ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. ఖరీదు కాస్త ఎక్కువైనా నాణ్యత కలిసి వస్తుందని సున్నం వ్యాపారులు కొందరు కొన్నాళ్లుగా పెట్రోకోక్ను గుట్టుచప్పుడు కాకుండా పిడుగురాళ్లకు తరలిస్తున్నారు. పెట్రోకోక్ను సున్నం బట్టీల్లో వినియోగించేందుకు కొన్ని నిబంధనలున్నాయి. చెన్నై నుంచి కడప, కర్నూలు ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలకు వెళ్లాల్సిన బొగ్గు కొన్నాళ్లుగా పిడుగురాళ్ల ప్రాంతానికి తరలివస్తుంది. లారీకి ఉండాల్సిన పర్మిట్లు అన్ని వేరే ప్రాంతాలకు చెందినవిగా ఉంటాయి. సరుకుమాత్రం పిడుగురాళ్ల సున్నం బట్టీల్లో ప్రత్యక్షమవుతుంది.
పెట్రోకోక్ ధర టన్ను సుమారుగా రూ.11వేలు ఉండగా, ఒక టన్ను బొగ్గు ధరలో 18శాతం వాణిజ్యపన్నుల శాఖకు చెల్లించాల్సి ఉంది. అవేమీ లేకుండానే గుట్టుచప్పుడు కాకుండా పెట్రోకోక్ లారీలు పిడుగురాళ్లకు వస్తోంది. ఒక్కొక్క బట్టీకి నెలకు రెండు లారీల పెట్రోకోక్ను వాడుతున్నట్లు సమాచారం. కొందరు వ్యాపారులు పెట్రోకోక్ను బొగ్గుపొడిగా చూపి 5శాతం పన్ను చెల్లించి మిగిలిన 13శాతం ఎగ్గొట్టేస్తున్నారు. నెలకు సగటున 120 లారీల పెట్రోకోక్ పిడుగురాళ్లకు దొడ్డిదారిన వస్తుంది. అంటే ప్రభుత్వానికి సుమారుగా రూ25లక్షలను చెల్లించకుండానే చీకటి వ్యాపారం చేస్తున్నారు.
ఎక్కడికి వెళ్లాలో ముందే....
బొగ్గు లారీ ఏరోజు ఏ బట్టీకి వెళ్లాలో కొందరు వ్యక్తులు ముందే నిర్ణయిస్తారు. బొగ్గులారీ కొండమోడు వద్దకు రాగానే సంబంధిత వ్యక్తులు ఎదురెళ్లి లారీని తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం బొగ్గును బట్టీల్లో అన్లోడ్ చేయిస్తారు. ఈ తతంగమంతా కొందరు వ్యక్తుల కనుసన్నల్లో కొన్నాళ్లుగా నడుస్తుంది. ఎవరికీ అనుమానం రాకుండా అప్పుడప్పుడు ఒక లారీని వాణిజ్యపన్నుల శాఖాధికారులకు పట్టించి నామమాత్ర పెనాల్టీలు విదించేలా చేస్తూ కొందరు పెద్దల అండదండలతోనే ఈ తతంగాన్ని నడుపుతున్నట్లు సమాచారం.