ఆక్రమణల చెర!
ABN , First Publish Date - 2021-06-23T05:47:57+05:30 IST
పిడుగురాళ్లలో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు.
పిడుగురాళ్ల, ఏప్రిల్22: పిడుగురాళ్లలో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. ఖాళీగా ఉంటే చాలు కన్నేస్తున్నారు. పిడుగురాళ్ల బైపాస్రోడ్డు సమీపంలో రజక కాలనీకి ఆనుకొని చెరువును కబ్జా చేశారు. అదే ప్రాంతంలో కొందరు వ్యక్తులు అధికారపార్టీ నేతల పేరు చెప్పుకొని స్థలాలు ఆక్రమించి, అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. బైపాస్రోడ్డు ప్రక్కనే సుమారు 50సెంట్లకు పైగా ప్రభుత్వ భూమిని మెరక తోలారు. ఆ పక్కనే నిరుపేదలైన కొందరు వేసుకున్న తాత్కాలిక నివాసాలను అఽధికారులు తొలగించారు. కానీ ప్రభుత్వ భూమిని మట్టితో నింపిన వారెవరో ఆరా తీయలేదు. అదే విధంగా అద్దంకి - నార్కెట్పల్లి హైవే పక్కన కూడా విలువైన సుమారు 18సెంట్ల ప్రభుత్వ స్థలం కూడా కబ్జాదారుల చెరలోకి వెళ్లింది. గతంలో ఇక్కడ ప్రభుత్వ భూమిగా చూపి రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదే భూమిని కొందరు ఎక్కడో ఉన్న సర్వే నెంబర్తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇదే భూమికి ప్రభుత్వం ఎన్నో ఏళ్ల క్రితం పట్టా ఇచ్చిందంటూ ఇంకొకరు కోర్టుకు వెళ్లటంతో ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. హైవే ప్రక్కనే ఆక్రమణ జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్కళాశాల సమీపంలోనూ ఆక్రమణ దారులు రెచ్చిపోతున్నారు. వాగు పోరంబోకు భూమిలో కొందరు నిర్మాణాలు కూడా మొదలుపెట్టారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, మున్సిపల్ అధికారుల్లో కనీసం చలనం లేదు. ప్రభుత్వ భూమిని అన్యాయంగా ఆక్రమించేస్తున్నారని అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసే సాహసం ఎవరూ చేయకపోవడంతో కబ్జాదారులు బరితెగించేస్తున్నారు. దీనిపై తహసీల్దారు భాస్కరరావును వివరణ కోరగా పిడుగురాళ్ల పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు చేపడుతున్నట్లు తనకు ఫిర్యాదు అందలేదన్నారు.