స్వాతంత్ర్య సమర యోధులు, రాజ్యాంగ విశిష్టత పై చాయా చిత్ర ప్రదర్శన

ABN , First Publish Date - 2021-11-24T22:22:34+05:30 IST

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో, కోఠిలోని యూనివర్సిటీ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన చాయా చిత్ర ప్రదర్శనను కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజ్యుళ్ళత ఈ రోజు ప్రారంభించారు.

స్వాతంత్ర్య సమర యోధులు, రాజ్యాంగ విశిష్టత పై చాయా చిత్ర ప్రదర్శన

హైదరాబాద్: దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో, కోఠిలోని యూనివర్సిటీ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన చాయా చిత్ర ప్రదర్శనను కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజ్యుళ్ళత ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య అమృత మహోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని, దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో  మహానీయులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అనేక పోరాటాలు జరిపారని, యువత  స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను  స్ఫూర్తి గా తీసుకుని ముందుకు సాగాలన్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా  ఎందరో స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని, 'ఆజాది కా అమృత్ మహోత్సవాల'లో భాగంగా ఆ మహనీయుల త్యాగాలు, వారి వీరోచిత పోరాటాల గురించి నేటి తరానికి తెలియచేయాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన విధ్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.


యువతలో స్ఫూర్తిని రగిల్చే విధంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు ఉంటుంది. విధ్యార్థులు ఈ ప్రదర్శనలో భాగమవ్వాలని ఆమె కోరారు. దేశ అభివృద్ధికి, సమైక్యత,సమగ్రత ల పరిరక్షణకు ప్రతి ఒక్కరు  కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య అమృత మహోత్సవాలను జరుపుకుంటున్నఈ తరుణంలో ఇటువంటి  మంచి ఛాయా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసి, విద్యార్థుల్లో స్ఫూర్తి నింపినందుకు ఆర్ఓబి  అధికారులను ఆమె అభినందించారు. ఆర్ఓబి అసిస్టెంట్ డైరెక్టర్ ఐ.హరిబాబు మాట్లాడుతూ పింగళి వెంకయ్య, కుమురం భీం, చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్థ, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, సురవరం ప్రతాపరెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి ఎందరో  స్వాతంత్ర్య సమరయోధల జీవిత విశేషాలకు సంబంధించిన 40 కి పైగా ఛాయాచిత్రాలను  ఈ ప్రదర్శనలో ఉంచామని  తెలిపారు.


ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ  దినోత్సవం సంధర్భంగా భారత రాజ్యాంగం, దాని విశిష్టత గురించి తెలియచేసే 15 ఫోటో ప్యానెల్స్ ను కూడా ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.ఈ ఛాయాచిత్ర ప్రదర్శన, నవంబరు 26వ తేదీ వరకు మూడు రోజులపాటు కొనసాగుతుంది. ఈ సందర్భంగా విద్యార్ధులకు అర్ఓబి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమర యోధుల పై పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా ఎక్కువ  సంఖ్యలో ఈ పోటీలలో పాల్గొన్నారు.  ఫోటో ఎగ్జిబిషన్ ను కూడా  విద్యార్థులు ఆసక్తి గా తిలకించారు.  ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ భరత లక్ష్మి, ఎగ్జిబిషన్ అధికారి అర్థ శ్రీనివాస్ పటేల్, కళాశాల అధ్యాపక బృందం, విధ్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-24T22:22:34+05:30 IST