మా ఫోన్లను మమత ట్యాప్ చేస్తున్నారు : Bengal BJP

ABN , First Publish Date - 2021-07-21T22:58:08+05:30 IST

పెగాసస్‌పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపణలు గుప్పించిన వెంటనే బీజేపీ ఎమ్మెల్యే సుబేందు అధికారి

మా ఫోన్లను మమత ట్యాప్ చేస్తున్నారు : Bengal BJP

కోల్‌కతా : పెగాసస్ స్పైవేర్ వ్యవహారం కేంద్రంలో దుమ్ము దుమారం రేపుతోంది. ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్‌లోనూ అధికార పక్షంపై ప్రతిపక్ష బీజేపీ ఇలాంటి ఆరోపణలే చేస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ ఫోన్లను ట్యాప్ చేస్తోందని బీజేపీ అగ్రనేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే సుబేందు అధికారి మమత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలకు దిగారు. మమత ప్రభుత్వం తన ఫోన్లను ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. ఇలా ట్యాపింగ్ చేయడం వల్ల ఎవరితోనూ మాట్లాడడానికి వీలు కావడం లేదని అన్నారు. కేవలం వాట్సాప్ ద్వారానో, లేదంటే ఫేస్‌టైమ్ అన్న యాప్ ద్వారానో మాట్లాడుకోవడమే అవుతోందని మండిపడ్డారు. కేవలం తన ఫోన్లు మాత్రమే కాదని, బీజేపీ నేతలందరి ఫోన్లనూ మమత ట్యాప్ చేయిస్తోందని సుబేందు మండిపడ్డారు. ఇక బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కూడా మమత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. టీఎంసీ నేతల ఫోన్లను కూడా మమతా బెనర్జీ ట్యాప్ చేస్తున్నారని సొంత పార్టీ నేతలే భయపడుతున్నారని, అందుకే కేవలం వాట్సాప్‌లోనే మాట్లాడుకుంటున్నారని దిలీప్ ఘోష్ అన్నారు. మమత ప్రభుత్వం పెగాసస్ సాంకేతికతను ఉపయోగించి ఫోన్లను ట్యాప్ చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఫోన్లను ట్యాప్ చేయడం బీజేపీ పనికాదని, అది కాంగ్రెస్ సంస్కృతే అని దిలీప్ ఘోష్ మండిపడ్డారు. ఆ కాంగ్రెస్ నుంచే మమత కూడా వచ్చారని, అందుకే ఆమె రాష్ట్రంలోని నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తున్నారని దిలీప్ ఘోష్ మండిపడ్డారు.

  

Updated Date - 2021-07-21T22:58:08+05:30 IST