ఆరోగ్య సంరక్షణ రంగానికి నిధులు పెంచాలి
ABN , First Publish Date - 2022-01-24T06:58:08+05:30 IST
బడ్జెట్లో ఆర్ అండ్ డీ కార్యకలాపాలను ప్రోత్సహించే విధానాలపై దృష్టిపెట్టాలని, వివిధ ఔషధాలపై పన్ను రాయితీలను కొనసాగించాలని ఫార్మా రంగం కోరుతోంది..
ఫార్మా పరిశ్రమ
న్యూఢిల్లీ: బడ్జెట్లో ఆర్ అండ్ డీ కార్యకలాపాలను ప్రోత్సహించే విధానాలపై దృష్టిపెట్టాలని, వివిధ ఔషధాలపై పన్ను రాయితీలను కొనసాగించాలని ఫార్మా రంగం కోరుతోంది. ప్రైవేటు కంపెనీల వ్యాపారాన్ని సులభతరం చేయడానికి వివిధ ప్రక్రియలను సరళీకరించాలం టోంది. బయో-ఫార్మా ఆర్ అండ్ డీ కోసం ప్రత్యేక కేటాయింపుతో పాటు జాతీయ ఆరోగ్య విధానం 2017 ప్రకారం బడ్జెట్ కేటాయింపులను జీడీపీలో ప్రస్తుత 1.8 శాతం నుంచి 2.5-3 శాతానికి పెంచడం తప్పనిసరని ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మాసూటికల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా (ఓపీపీఐ) అధ్యక్షుడు ఎస్ శ్రీధర్ పేర్కొన్నారు. కొవిడ్ మాత్రమే కాకుండా వివిధ వ్యాధుల్లో వినూత్న ఆరోగ్య పరిష్కారాలను పొందేందుకు, ఈ రంగంలో వృద్ధిని వేగవంతం చేయడానికి ఈ ఏడాది బడ్జెట్ చాలా కీలకమన్నారు. ఔషధాలపై ప్రస్తుతమున్న కస్టమ్స్ సుంకం రాయితీలను ప్రభుత్వం కొనసాగించాలని, ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని నిలిపివేస్తే సరసమైన ధరల్లో అలాంటి ఔషధాల లభ్యతపై ప్రభావం పడటానికి అవకాశం ఉందని చెప్పారు.