పెట్రోల్ కోసం ఆ దేశానికి క్యూ
ABN , First Publish Date - 2021-02-25T16:09:07+05:30 IST
పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు భగ్గుమండడంతో వాహనాలు బయటకు తీయాలంటే ఆలోచించే పరిస్థితి కనబడుతోంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.54కు చేరింది. డీజిల్ కూడా రూ. 88.69కు చేరింది. దేశంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ కొట్టేయడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. తాజాగా భారత దేశంలోని కొంతమంది పెట్రోల్ కోసం నేపాల్కు క్యూ కడుతున్నారు. ఎందుకంటే అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 70, డీజిల్ రూ. 59 మాత్రమే. భారత్ సరిహద్దు దేశమైన నేపాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉంటాయి. దీంతో సరిహద్దు ప్రాంతంలో ఉండే గ్రామస్తులు అక్కడకు వెళ్లి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే స్మగ్లింగ్ కూడా చేస్తున్నారు.
భారత్లోని చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ. 100కు దగ్గరలో ఉంది. డీజిల్ రూ. 90 వద్ద ఉంది. ఇది ప్రతి వాహనదారుడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నేపాల్ కరెన్సీ భారత్ రూపాయితో పోల్చుకుంటే లీటరు పెట్రోల్ రూ. 70, డీజిల్ రూ. 59గా ఉంది. ఈ విషయం నేపాల్ ఆయిల్ కార్పొరేషన్కు తెలియడంతో కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చింది. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పెట్రోల్ బంకుల్లో తనికీలు నిర్వహిస్తోంది. బ్లాక్ మార్కెట్ జరక్కుండా నేపాల్ అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటోంది.