పెట్రో మంటలు!
ABN , First Publish Date - 2022-03-12T07:03:10+05:30 IST
ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. రష్యా-ఉక్రెయిన్ల మధ్య సాగుతున్న యుద్ధం ప్రభావం.. క్రూడాయిల్ ధరలపై విపరీతంగా పడింది. ...
పలు దేశాల్లో రికార్డు
స్థాయికి చమురు ధరలు
అమెరికాలో 14 ఏళ్ల
గరిష్ఠానికి చేరిక
శ్రీలంకలో లీటరు
పెట్రోల్కు రూ.50 పెంపు
యుద్ధమే కారణం
పలు దేశాల్లో రికార్డు స్థాయి దాటిన చమురు ధరలు
అమెరికాలో 14 ఏళ్ల గరిష్ఠానికి చేరిక.. లీటరు పెట్రోలు 86.97
శ్రీలంకలో పెట్రోల్పై రూ.50, డీజిల్పై రూ.75 పెంపు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధమే కారణం
న్యూఢిల్లీ, మార్చి 11: ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. రష్యా-ఉక్రెయిన్ల మధ్య సాగుతున్న యుద్ధం ప్రభావం.. క్రూడాయిల్ ధరలపై విపరీతంగా పడింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. అగ్రరాజ్యం అమెరికాలో చమురు ధరలు ఆల్టైం రికార్డును నమోదు చేశాయి. ఈ ధరలు 14 ఏళ్ల గరిష్ఠానికి చేరడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. అయితే.. మనదేశంలోని పెట్రోల్ ధరలతో పోల్చుకుంటే అగ్రరాజ్యంలో తక్కువగానే ఉండడం గమనార్హం. అమెరికాలో శుక్రవారం నా టికి గ్యాలన్ గ్యాసోలిన్(పెట్రోల్) ధర 4.31 డాలర్లుగా నమోదైంది. ఇది రూ.329కి సమానం. ఈ స్థాయిలో పెట్రోల్ ధరలు పెరగడం.. 2008 తర్వాత ఇదే మొదటి సారి. 2008, జూలై 17న గ్యాలన్ గ్యాసోలిన్ ధర 4.11 డాలర్లుగా ఉంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ రేంజ్లో ధరలు పెరగాయని అధికార వ ర్గాలు తెలిపాయి. అదేసమయంలో డీజిల్ ధరలు కూడా మరింత పెరిగాయి. గ్యాలన్ డీజిల్ ధర 5.05 డాలర్లుగా నమోదైంది. అమెరికాలో చమురును లీటర్లలో కాకుండా గ్యాలన్లలో విక్రయిస్తారు. ఒక గ్యాలన్ 3.78 లీటర్లకు సమానం. అదే బ్రిటన్లో అయితే ఇంపీరియల్ గ్యాలన్గా పిలుస్తారు. ఇది 4.54 లీటర్లకు సరిసమానం. దీనిని బట్టి అమెరికాలో ఒక లీటరు పెట్రోలు ధర భారత కరెన్సీలోకి మార్చితే రూ.86.97గా ఉంది.
మన దేశంలో పరిస్థితి ఇదీ..
మన దేశంలో పరిస్థితిని గమనిస్తే.. లీటరు పెట్రోలు రూ.90-110 మధ్య పలుకుతోంది. ముంబైలో రూ.109.98, దేశరాజధాని ఢిల్లీలో రూ.95.41, చెన్నైలో రూ.101.40, కోల్కతాలో రూ.104.67గా ఉంది. అయితే, గత నవంబరు నుంచి 4 నెలలుగా దేశంలో చమురు ధరలు స్థిరంగా ఉండడం విశేషం. అప్పట్లో కేం ద్రం లీటరుపై రూ.5, డీజిల్పై రూ.10 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. దీంతో కొ న్ని రాష్ట్ర ప్రభుత్వాలూ అమ్మకం పన్నును కొంత మేరకు తగ్గించాయి.
అమెరికాలోనూ ధరల్లో తేడా
భారత్లో మాదిరిగానే అమెరికాలో కూడా పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. గ్యాలన్ పెట్రోల్ ధర కాలిఫోర్నియాలో 5.69 డాలర్లు(లీటరు రూ.114.82) ఉండగా, నేవాడాలో 4.87 డాలర్లు(లీటరు రూ.97.06), హవాయిలో 4.81 డాలర్లు(లీటరు రూ.95.25), ఓరెగావ్లో 4.72 డాలర్లు(లీటరు రూ.95.25), వాషింగ్టన్లో 4.70 డాలర్లు(లీటరు రూ.94.85)గా ఉంది. అయితే.. వివిధ చోట్ల ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ భారత్లో ధరల కంటే కూడా తక్కువగానే ఉండడం గమనార్హం.
యుద్ధం ప్రభావంతో..
రష్యా-ఉక్రెయిన్ల మధ్య సాగుతున్న యుద్ధం ప్రభావం చమురు ధరలపై పడింది. దీంతో కేవలం 14 రోజుల్లోనే గ్యాలన్ పెట్రోల్ ధర 0.70 డాలర్లకు పెరిగిందని అమెరికాకు చెందిన చమురు ధరల పరిశీలన సంస్థ ఏఏఏ పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్యాసోలిన్ గ్యాలన్ ధర 3.53 డాలర్లుగా ఉన్నప్పుడే.. అమెరికా ప్రజలు ఈ ధరలు భరించలేమంటూ.. గగ్గోలు పెట్టారని ఏఏఏ తెలిపింది. అయితే.. ఇప్పుడు ఈ ధర ఏకంగా 4 డాలర్లకు చేరడంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నట్టు పేర్కొంది. కాగా, భారత్లో పెట్రోల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వినియోగదారులు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాలుగు మాసాలుగా ధరలను సవరించలేదు. అయితే, ఇప్పుడు ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేసిన నేపథ్యంలో ఇక, బాదుడు తప్పదని వినియోగదారులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. క్రూడాయిల్ ధరలు నానాటికీ పెరు గుతున్నాయి. నవంబరులో 82.74 డాలర్లుగా ఉన్న బ్యారెల్ క్రూడాయిల్ ధర, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో 140 డాలర్లకు అమాంతం పెరిగిపోయింది. అదే సమయంలో డాలర్తో రూపాయి మారకం విలువ మరింత తగ్గి 77 దగ్గర ఊగిసలాడుతోంది. ఇది మరింత తగ్గితే.. ధరలపై ప్రభావం పడుతుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
శ్రీలంకలో భారీ బాదుడు
పెట్రోల్ ధరల పెరుగుదలతో శ్రీలంక ప్రజలు అల్లాడిపోతున్నారు. శ్రీలంకలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) యూనిట్.. పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా రూ.50, రూ.75 చొప్పున ఒకేసారి పెంచేసింది. పెరిగిన ధరలు గురువారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ఇలా ఒకే సారి ధరలు పెరగడానికి ఐస్లాండ్కు చెందిన సెంట్రల్ బ్యాంక్ ఫ్లెక్సిబుల్ ఎక్సేంజ్ రేట్ సుమారు 30ు తరుగుదల నమోదు చేయడమే కారణంగా కనిపిస్తోంది. దీంతో ఎక్కువ మంది వినియోగించే ఆక్టేన్(పెట్రోల్) రికార్డు స్థాయిలో 24.5ు పెరిగి రూ.254గా ఉండగా, డీజిల్ 54శాతం పెరిగి రూ.214కు చేరింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగానే తాము ధరలను సవరించాల్సి వచ్చిందని ఐవోసీ పేర్కొంది. గడిచిన 14 రోజుల్లో ఐవోసీ రెండు సార్లు ధరలు పెంచగా, స్థానిక ప్రభుత్వ రంగ సంస్థ సీలోన్ పెట్రోలియం కార్పొరేషన్ మాత్రం స్వల్ప మొత్తంలోనే ధరలను పెంచడం గమనార్హం. అయితే.. ఇప్పటి వరకు శ్రీలంక ప్రభుత్వం మాత్రం ధరల విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.