బీ రెడీ.. 5 రూపాయలు పెరగనున్న పెట్రో ధరలు!

ABN , First Publish Date - 2020-05-28T21:25:03+05:30 IST

వాహన వినియోగదారులకు ఇది షాకింగ్ న్యూసే. వచ్చే నెలలో పెట్రో ధరలు లీటరుకు నాలుగైదు రూపాయలు

బీ రెడీ.. 5 రూపాయలు పెరగనున్న పెట్రో ధరలు!

న్యూఢిల్లీ: వాహన వినియోగదారులకు ఇది షాకింగ్ న్యూసే. వచ్చే నెలలో పెట్రో ధరలు లీటరుకు నాలుగైదు రూపాయలు పెరిగే అవకాశం ఉంది. జూన్‌లో లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత పెట్రోలియం కంపెనీలు తిరిగి ధరలను రోజు వారీ సమీక్షించనున్నాయి. ఈ నేపథ్యంలో ధరలు పెరిగే అవకాశం ఉందని సమాచారం. లాక్‌డౌన్ తర్వాతి పరిస్థితిని సమీక్షించడానికి, రోజువారీ ఇంధన ధరల పెంపుపై కార్యాచరణ రూపొందించేందుకు గత వారం ఇంధన రిటైలర్లు సమావేశమైనట్టు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ(ఓఎంసీ)లు తెలిపాయి. ఒకవేళ లాక్‌డౌన్ ఐదో దశలోకి ప్రవేశించినా రోజువారీ ధరల సమీక్ష మాత్రం ప్రారంభమవుతుందని తెలుస్తోంది. 


ప్రస్తుతం ఓంఎంసీలు ఖర్చుకంటే తక్కువకు విక్రయిస్తుండడంతో నష్టాలు మూటగట్టుకుంటున్నాయి. ప్రభుత్వం కనుక ధరల సమీక్షకు అనుమతిస్తే అవి నష్టాల ఊబి నుంచి బయటపడతాయి. లాక్‌డౌన్‌ను ఒకవేళ పొడిగించినా మరిన్ని సడలింపులు ఉంటాయని భావిస్తున్నారు. అలాగే, మార్కెట్ నిర్ణయించిన ధరలకే పెట్రోలు, డీజిల్‌ను విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందని భావిస్తున్నారు. 


ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోలు, డీజిల్ కొనుగోలుకు, విక్రయానికి మధ్య ఇప్పటికే లీటరుకు నాలుగైదు రూపాయల అంతరం ఉంది. గ్లోబల్ ధరల్లో పెరుగదల లేనందున, రెండు వారాల పాటు రోజుకు 40-50 పైసలు పెంచుకుంటూ పోతే కొద్దికాలంలోనే నష్టాల నుంచి బయటపడవచ్చన్నది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఆలోచనగా తెలుస్తోంది. అయితే, రోజువారీ ధరల సమీక్షకు ప్రభుత్వం అనుమతిచ్చినా ఓ స్థాయి దాటిన తర్వాత ధరల పెంపునకు అనుమతి ఇవ్వకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంటే, కొనుగోలు, విక్రయానికి మధ్యనున్న అంతరం పూడ్చే వరకు రోజుకు గరిష్టంగా 20-40 పైసలకు మించి పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు.

Updated Date - 2020-05-28T21:25:03+05:30 IST