దొడ్డిదారిన...పెట్రోకోక్పై విచారణ జరపండి
ABN , First Publish Date - 2020-08-11T09:42:08+05:30 IST
పిడుగురాళ్ళలో సున్నంబట్టీలకు కొందరు దొడ్డిదారిన పెట్రోకోక్ను తరలించటంపై సమగ్ర విచారణ జరపాలని వాణిజ్యపన్నులశాఖ ..
లారీల పర్మిట్లను పరిశీలించి నివేదిక అందజేయాలి
’ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందించిన సీటీ శాఖ జేసీ
గుంటూరు, ఆగస్టు 10: పిడుగురాళ్ళలో సున్నంబట్టీలకు కొందరు దొడ్డిదారిన పెట్రోకోక్ను తరలించటంపై సమగ్ర విచారణ జరపాలని వాణిజ్యపన్నులశాఖ నరసరావుపేట జాయింట్ కమిషనర్ కిరణ్చౌదరి ఆదేశించారు. ఎటువంటి పర్మిట్లు లేకుండా దొడ్డిదారిలో పిడుగురాళ్ళ సున్నంబట్టీలకు పెట్రోకోక్ను తరలిస్తుండటంపై ఆదివారం ఈనెల 9న ’ఆంధ్రజ్యోతి’ జిల్లా సంచికలో ప్రచురితమైన కథనంపై నరసరావుపేట డివిజన్ జాయింట్ కమిషనర్ కిరణ్చౌదరి స్పందించారు.
పెట్రోకోక్ తరలింపు వ్యవహారంపై పిడురాళ్ళ సీటీవో మల్లికార్జునరావుతో ఫోన్లో మాట్లాడి ఆరా తీసినట్లు తెలిపారు. పెట్రోకోక్ ఎక్కడ నుంచి వస్తుంది, ఆయా లారీలకు పర్మిట్లు ఉన్నాయా లేవా అనే వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో నివేదిక అందజేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. పెట్రోకోక్ను అక్రమంగా తరలించినట్లు తేలితే ఆయా సున్నంబట్టీల యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవటంతో పాటు జీఎస్టీ, పెనాల్టీ విదిస్తామని స్పష్టం చేశారు.