పండగ షాపింగ్‌కు పెట్రో సెగ !

ABN , First Publish Date - 2021-10-25T07:25:31+05:30 IST

ప్రస్తుత పండగల సీజన్‌లో హైదరాబాద్‌ సహా దేశంలోని 10 అగ్రశ్రేణి నగరాల్లోని వినియోగదారులు కొనుగోళ్లు చేస్తున్నప్పటికీ.. పెట్రోల్‌ ధరల పెరుగుదల కారణంగా..

పండగ షాపింగ్‌కు పెట్రో సెగ !

తక్కువ ధరల ఉత్పత్తులకు ప్రాధాన్యత ఫ మారిన కొనుగోలుదారుల వైఖరి

లోకల్‌ సర్కిల్స్‌ సర్వే వెల్లడి 

న్యూఢిల్లీ : ప్రస్తుత పండగల సీజన్‌లో హైదరాబాద్‌ సహా దేశంలోని 10 అగ్రశ్రేణి నగరాల్లోని వినియోగదారులు కొనుగోళ్లు చేస్తున్నప్పటికీ.. పెట్రోల్‌ ధరల పెరుగుదల కారణంగా తక్కువ బడ్జెట్‌కు అందుబాటులో ఉన్న వస్తువులనే కొంటున్నట్లు ఒక సర్వేలో తేలింది. ‘‘వినియోగదారుల ధోరణి’’పై లోకల్‌ సర్కిల్స్‌ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. పెట్రోలియం ధరల పెరుగుదల వల్ల వారు బడ్జెట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని, తక్కువ ధర గల వస్తువులపై మొగ్గు చూపుతున్నారని ఆ సంస్థ ఒక నివేదికలో తెలిపింది. ప్రధానంగా గత 30 రోజుల కాలంలో పెట్రో ధరల పెరుగుదల ధోరణి పట్ల వారు తీవ్ర ఆవేదన ప్రకటించారని లోకల్‌ సర్కిల్స్‌ వ్యవస్థాపకుడు సచిన్‌ తపాడియా తెలిపారు. 10 నగరాల్లోను 61 వేల మంది గృహస్థులను ఈ సర్వేలో పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తం 1.95 లక్షల మంది ఈ సర్వేకు స్పందించి తమ అభిప్రాయాలు తెలియచేశారు.


హైదరాబాద్‌ ఓటు స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ర్టానిక్స్‌కే..

పండగల సీజన్‌ కొనుగోళ్లలో స్మార్ట్‌ఫోన్లు, కన్స్యూమర్‌ ఎలక్ర్టానిక్స్‌, గృహోపకరణాలు, గృహ నవీకరణ ఉత్పత్తులు, డివై్‌సలు అగ్రస్థానంలో ఉన్నాయి. హైదరాబాద్‌, నోయిడాలకు చెందిన వినియోగదారులందరూ స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ర్టానిక్స్‌ ఉత్పత్తుల కొనుగోలుకే మొగ్గు చూపారు. ఆహారం, ఇతర కిరాణా వస్తువుల విషయానికి వస్తే హైదరాబాద్‌ ప్రజలు డ్రైఫ్రూట్స్‌, సాంప్రదాయిక స్వీట్స్‌, చాకొలేట్లు, బేకరీ ఉత్పత్తులకే మొగ్గు చూపారు. అలాగే వస్త్రాల కొనుగోలుకు కూడా వారు ప్రాధాన్యం ఇస్తున్నారు. పండగల సీజన్‌లోని మిగతా ప్రాధాన్యతల్లో కాస్మెటిక్స్‌, ఫ్రాగరెన్స్‌, షూ, బ్యాగ్‌లు, ఇతర యాక్సెసరీలు ఉన్నాయి. 


ఇతర ముఖ్యాంశాలు...


కొవిడ్‌ కేసులు గణనీయంగా తగ్గడంతో వినియోగ సెంటిమెంట్‌ విశేషంగా మెరుగుపడింది. ఈ ఏడాది మే నెలతో పోల్చితే సెప్టెంబరు నాటికి ఇది 30 శాతం నుంచి 60 శాతానికి పెరిగింది.

అగ్రశ్రేణిలోని టాప్‌ 8 నగరాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు తాము భద్రతకే ప్రాధాన్యం ఇస్తున్నామంటూ ఈ కారణంగా పండగ సీజన్‌ కొనుగోళ్లు ఆన్‌లైన్‌లోనే చేస్తున్నట్టు తెలిపారు. ముంబై, కోల్‌కతా ప్రజలు మాత్రం మార్కెట్‌కు వెళ్లి కొనుగోళ్లు చేస్తున్నట్టు తెలిపారు. ఆన్‌లైన్‌ కొనుగోళ్లలో 75 శాతంతో హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉంది. 

సర్వే జరిగిన నగరాల్లో హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌, పుణె, గురుగ్రామ్‌, నోయిడా ఉన్నాయి.

Updated Date - 2021-10-25T07:25:31+05:30 IST