నేడు తెరుచుకోనున్న పేట మార్కెట్‌

ABN , First Publish Date - 2021-05-17T05:46:16+05:30 IST

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం నుంచి క్రయవిక్రయాలు ప్రారంభంకానున్నాయి. కమీషన్‌దారులు, మార్కెట్‌ కార్యాలయ సిబ్బంది కరోనాబారిన పడటంతో ఈ నెల 7నుంచి 16వ తేదీ వరకు వ్యవసాయ మార్కెట్‌లో క్రయ విక్రయాలు నిలిపివేసి, పదిరోజులపాటు సెలవు ప్రకటించారు. సెలవు గడువు ఆదివారంతో ముగియడంతో సోమవారం యథావిధిగా కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి.

నేడు తెరుచుకోనున్న పేట మార్కెట్‌
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డు సముదాయం

పది రోజుల అనంతరం ప్రారంభంకానున్న క్రయవిక్రయాలు

పాజిటివ్‌ కేసులు నమోదవడంతో ఈ నెల 7నుంచి బంద్‌

కమీషన్‌దారులను వెంటాడుతున్న కరోనా భయం


సూర్యాపేట సిటీ, మే 16: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం నుంచి క్రయవిక్రయాలు ప్రారంభంకానున్నాయి. కమీషన్‌దారులు, మార్కెట్‌ కార్యాలయ సిబ్బంది కరోనాబారిన పడటంతో ఈ నెల 7నుంచి 16వ తేదీ వరకు వ్యవసాయ మార్కెట్‌లో క్రయ విక్రయాలు నిలిపివేసి, పదిరోజులపాటు సెలవు ప్రకటించారు. సెలవు గడువు ఆదివారంతో ముగియడంతో సోమవారం యథావిధిగా కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. అయితే పది రోజులుగా మార్కెట్‌ బంద్‌కావడంతో ధాన్యం విక్రయించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఐకేపీ కేంద్రాల్లోనే ధాన్యం రాశులుపోసి పడిగాపులుకాశారు.


వెంటాడుతున్న కరోనా భయం

వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం నుంచి క్రయవిక్రయాలు ప్రారంభం కానుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా, కమీషన్‌దారులను మాత్రం కరోనా భయం వెంటాడుతోంది. ఇప్పటికే ఇద్దరు కమీషన్‌దారులు కరోనాబారిన పడి మృత్యువాత పడ్డారు. అనాధికారికంగా కొంతమంది కమీషన్‌దారులు పాజిటివ్‌తో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, మరికొంతమంది హోంఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మార్కెట్‌లో వ్యాపారానికి కమీషన్‌దారులు జంకుతున్నారు. ఇదిలా ఉండగా, మార్కెట్‌లో పనిచేసే హమాలీలు, దడువాయిలు, మహిళా స్వీపర్లు వివిధ ప్రాంతాల నుంచి వాహనాల్లో రావాల్సి ఉంటుంది. లాక్‌డౌన్‌ మినహాయింపు ఉన్న ఉదయం సమయంలో ఏదో ఒక వాహనంలో మార్కెట్‌కు వచ్చినా, సాయంత్రం వేళ పోలీసులు అనుమతి ఇవ్వకుంటే ఎలా అని వారు మదనపడుతున్నారు. దీనికితోడు లాక్‌డౌన్‌తో మార్కెట్‌ సమీపంలో ఉన్న భోజన హోటళ్లు మూతపడ్డాయి. ఈ పరిస్థితుల్లో భోజన సదుపాయం లేక మార్కెట్‌కు వచ్చే రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.


సజావుగా క్రయవిక్రయాలు : పుష్పాలత, మార్కెట్‌ అసిస్టెంట్‌ కార్యదర్శి

మార్కెట్‌లో సోమవారం క్రయవిక్రయాలు ప్రారంభంకానున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా మార్కెట్‌కు వచ్చే రైతులకు అవగాహన కల్పిస్తాం. భౌతికదూరం పాటిస్తూ కమీషన్‌దారులు వ్యాపారాన్ని నిర్వహించుకోవాలి. రైతులందరూ ఒకే దగ్గర గుమికూడకుండా ఉండేందుకూ ఎప్పటికప్పుడు సూపర్‌వైజర్లు మార్కెట్‌ యార్డుల్లో పర్యటిస్తారు. ప్రతి యార్డును శానిటైజ్‌ చేస్తాం.

Updated Date - 2021-05-17T05:46:16+05:30 IST