మందుల పిచికారితో మిడతల నియంత్రణ
ABN , First Publish Date - 2020-05-29T07:46:41+05:30 IST
ఐదు రాష్ట్రాలను ఎడారి మిడతలు చుట్టుముట్టేయడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. మిడతల ముప్పును ఎదుర్కొంటున్న రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లకు బాసటగా...
న్యూఢిల్లీ, మే 28: ఐదు రాష్ట్రాలను ఎడారి మిడతలు చుట్టుముట్టేయడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. మిడతల ముప్పును ఎదుర్కొంటున్న రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లకు బాసటగా నిలిచింది. ఆయా రాష్ట్రాల్లో నియంత్రణ చర్యలు చేపడుతున్నట్టు కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ ప్రకటించింది. క్రిమిసంహారక మందుల పిచికారీకి 89 ఫైర్ బ్రిగేడ్లు, 120 సర్వే వాహనాలు, పిచికారీ యంత్రాలు ఉన్న 40 కీటక నియంత్రణ వాహనాలు, 810 ట్రాక్టర్ స్ర్పేయర్లను రంగంలోకి దింపినట్టు తెలిపింది.
రాజస్థాన్లో 20 జిల్లాల్లో 90 వేల హెక్టార్ల భూమిని ఇప్పటికే కీటకాలు కమ్మేశాయి. పొరుగునే ఉన్న హరియాణాకు ప్రస్తుతం బెడద లేకున్నా.. ఏడు జిల్లాల్లో రైతులను సర్కారు అప్రమత్తం చేసింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో క్రిమిసంహారకాలను పిచికారీ చేయడంతో పెద్ద సంఖ్యలో కీటకాలు మరణించాయి. రానున్న రోజుల్లో బిహార్, ఒడిసా రాష్ట్రాలకూ వీడి బెడద తప్పదని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏవో) హెచ్చరించింది.